
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్నారు. నిత్యం ఎవర్నో ఒకర్నీ ట్రోల్ చేస్తూ సరదా మీమ్లతో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికర పోస్టుతో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ట్రోల్ చేశాడు. తొలుత ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఓ ట్వీట్ చేస్తూ.. ఆటగాళ్లు, జట్ల పేర్లు చెప్పకుండా మీ ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్ ఏంటో చెప్పని అడిగింది. దానికి స్పందించిన జాఫర్ అశ్విన్ను ట్యాగ్ చేసి ఓ మీమ్ను రీట్వీట్ చేశాడు.
అందులో ఆమిర్ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా లగాన్లోని ఓ క్రికెట్ సన్నివేశాన్ని జత చేశాడు. ఆమిర్ బ్యాటింగ్ చేస్తుండగా అవతలి ఎండ్లో ఉండే ఓ కుర్రాడు క్రీజు వదిలి ముందుకు రావడంతో బౌలర్ మన్కడింగ్ చేసే సీన్ అది. దీని ద్వారా గతేడాది ఐపీఎల్లో అశ్విన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ జోస్బట్లర్ను ఇలాగే ఔట్ చేసిన మ్యాచ్ ఇష్టమని చెప్పకనే చెప్పాడు.
ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచ క్రికెట్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు అశ్విన్ చర్యను తప్పుపట్టగా, మరికొందరు అతను నియమాలకు కట్టుబడే ఆడాడని మద్దతు తెలిపారు. అయితే, ఈ ఏడాది ఢిల్లీ తరఫున ఆడిన అశ్విన్ ఓ మ్యాచ్లో బెంగళూరు బ్యాట్స్మన్ ఆరోన్ఫించ్ను ఇలాగే ఔట్ చేసే అవకాశం ఉన్నా హెచ్చరించి వదిలేశాడు. ఇప్పుడు ఆ వివాదాస్పద అంశంపై వసీమ్ జోక్ చేయగా అశ్విన్.. 'జాఫర్ భయ్యా...'అని ఫన్నీ ఏమోజీలతో బదులిచ్చాడు.