న్యూఢిల్లీ: పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందంచిన పిచ్ అత్యంత దారుణమైందన్నాడు. ఇలాంటి చెత్త పిచ్ల కారణంగా టెస్ట్ క్రికెట్ మనుగడకే ముప్పు వాటిల్లుతందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. రెండు రోజుల పాటు ఆడి ఫస్ట్ ఇన్నింగ్స్ను 476/4 వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(157), అజార్ అలీ(185) భారీ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా కూడా ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖావాజా(97), డేవిడ్ వార్నర్(68) మంచి శుభారంభం అందివ్వగా.. మార్నస్ లబుషేన్(90), స్టీవ్ స్మిత్(78) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దాంతో 459 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ చివరి రోజు ఆటలో వికెట్ నష్టపోకుండా ఆడుతోంది. దాంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం రూపొందించిన వికెట్ను వసీం జాఫర్ తప్పుబట్టాడు.
ట్విటర్ వేదికగా తన అంసతృప్తిని వెళ్లగక్కాడు. ఈ రోజుల్లో చాలా మ్యాచ్లు నాలుగు రోజుల్లోనే ముగుస్తున్నాయని, అతి తక్కువ సందర్భాల్లో ఐదు రోజుల వరకు సాగుతున్నాయన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్ రేట్ కారణంగా ఏ జట్టు అయినా డబ్ల్యూటీ పాయింట్స్ కోల్పోతే ఆశ్చర్యకరమేనని పాక్-ఆస్ట్రేలియా మ్యాచ్ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక చెత్త పిచ్లు టెస్ట్ క్రికెట్ మనుగడకే ప్రమాదమన్నాడు. డెడ్ పిచ్ ఇక్వల్ టూ డెడ్ గేమని ట్వీట్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 476/4
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 459 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ 37 ఓవర్లలో 110/0