గతంలో చూసిన ఆటగాడు కాదు:
తాజాగా భారత మాజీ క్రికెటర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్చోప్రా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన వసీమ్ జాఫర్.. టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడంపై స్పందించాడు. 'రోహిత్ శర్మ ఇప్పుడు తన ఆటను మరింత బాగా అర్థం చేసుకుంటున్నాడు. గతంలో మనం చూసిన ఆటగాడు కాదు. ఎక్కడ తగ్గి ఆడాలో బాగా తెలుసుకున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్లను చూస్తే.. కొన్ని మ్యాచ్ల్లో ఎంతో ఓపిగ్గా ఆడాడు. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్తో ఆడేటప్పుడు తొలి పది ఓవర్ల పాటు బంతులు పరీక్ష పెట్టినా ఎంతో ఓపిగ్గా నిలబడి వికెట్ కాపాడుకున్నాడు' అని జాఫర్ అన్నాడు.
విదేశాల్లోనూ ద్విశతకాలు బాదగలడు
విదేశీ పిచ్లపైనా తొలి 45 నిమిషాలు తడబడతాడని, ఆ సమయాన్ని జయిస్తే రోహిత్ శర్మ అక్కడ కూడా ద్విశతకాలు సాధిస్తాడు అని వసీమ్ జాఫర్ చెప్పాడు. 'రోహిత్ విదేశీ పిచ్లపైనా తొలి 30-45 నిమిషాలు కొంచెం తడబడుతాడు. ఆ సమయాన్ని జయిస్తే అక్కడ కూడా ద్విశతకాలు సాధిస్తాడు. పరిస్థితులు చక్కబడ్డాయని అర్థం చేసుకున్నాక రోహిత్ చెలరేగిపోతాడు. అప్పుడు అతని స్ట్రైక్రేట్ 120-130కు పెరిగిపోతుంది. ప్రస్తుతం రోహిత్ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ ఎదురుదాడి చేయాలో అర్థం చేసుకునే దశలో ఉన్నాడు' అని వసీమ్ జాఫర్ చెప్పుకొచ్చాడు.
ఓపెనర్ అవతారం ఎత్తి
హిట్మ్యాన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20 మ్యాచ్లు ఆడాడు. 6 శతకాలు, 10 అర్ధ శతకాలతో టెస్టుల్లో 2141 పరుగులు బాదాడు. 2019లో టెస్ట్ ఓపెనర్ అవతారం ఎత్తి అద్భుత ప్రదర్శన చేసాడు. వరుస మ్యాచ్లలో శతకాలు బాదాడు. ఇక 2020లో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉన్నా.. తొడ కండరాలు పట్టేయడంతో ఆడలేకపోయాడు. ఆపై కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా మైదానంలోకి దిగలేదు. ఇక వన్డేల్లో 9115, టీ20ల్లో 2773 పరుగులు చేశాడు.
ఎంతో మెరుగైన తర్వాత కూడా చోటు దక్కలేదు
తాను ఆటగాడిగా ఎంతో మెరుగైన తర్వాత కూడా భారత జట్టులో చోటు దక్కలేదని మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇటీవల అసహనం వ్యక్తం చేశాడు. తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉందన్నాడు. 2000వ సంవత్సరంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జాఫర్.. 2008లో చివరి టెస్టు ఆడాడు. జాఫర్ భారత్ తరపున 31 టెస్టులు, 2 వన్డేలను మాత్రమే ఆడాడు. 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో కొనసాగిన జాఫర్ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికాడు.