వెల్లింగ్టన్: షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా వాయిదా వేసింది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే వేదిక ఎక్కడ అన్నది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
భారత్లో వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండడంతో.. ఐపీఎల్ 2020ని నిర్వహించేందుకు శ్రీలంక, యూఏఈలతో పాటు న్యూజిలాండ్ కూడా ముందుకొచ్చినట్లు ఇటీవల పలు వెబ్సైట్లు, పత్రికల్లో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్-13 సీజన్ను నిర్వహించడానికి కివీస్ ఆసక్తి చూపిస్తున్నట్లు వచ్చిన వార్తలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీ) తాజాగా ఖండించింది. ఐపీఎల్ నిర్వహించడానికి మేం ముందుకు రాలేదని, లీగ్కు ఆతిథ్యం ఇవ్వాలని బీసీసీఐ కూడా సంప్రదించలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2020 సీజన్ను నిర్వహించడానికి మేం ముందుకు రాలేదని న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి రిచర్డ్ బూక్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'ఐపీఎల్ 2020 నిర్వహించడానికి న్యూజిలాండ్ ఆసక్తి చూపిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ ఊహాగానాలే. మేం ఐపీఎల్కు ఆతిథ్యమివ్వడానికి ముందుకు రాలేదు. అలాగే ఐపీఎల్ను ఇక్కడ నిర్వహించాలని బీసీసీఐ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదు' అని రిచర్డ్ బూక్ చెప్పారు.
మంగళవారం బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ... 'ఏమాత్రం అవకాశమున్నా ఐపీఎల్ 2020ని భారత్లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోతే మాత్రమే విదేశాల్లో నిర్వహించడంపై ఆలోచిస్తాం. యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఐపీఎల్ ఆతిథ్యంపై తమ ప్రతిపాదనలు పంపాయి. ఒకవేళ విదేశాల్లో టోర్నీని నిర్వహించాల్సి వస్తే.. అప్పుడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఎక్కడ నిర్వహించాలో నిర్ణయిస్తాం. మా తొలి ప్రాధాన్యత భారత్కే, విదేశాల్లో నిర్వహణ అనేది ఆఖరి ప్రత్యామ్నాయం మాత్రమే' అని తెలిపారు.
గతంలో రెండుసార్లు భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. భారత్లో సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై, 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. దీంతో మరోసారి ఐపీఎల్ ఆతిథ్య అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతుండగా.. శ్రీలంక తమ దేశంలో వైరస్ కేసులు తక్కువగా నమోదవడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని నిర్వహిస్తామని హామీ ఇస్తోంది.
వైరల్ వీడియో: బర్త్ డే రోజున బైక్పై ధోనీ చక్కర్లు.. ఫాన్స్ కేరింతలు!!