
న్యూఢిల్లీ: భారత్పై వీలుచిక్కినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్కు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మరోసారి తనదైన శైలిలో చురకలంటించాడు. టీమిండియా విమర్శించినప్పుడల్లా వాన్కు తనదైన శైలిలో బదులిచ్చే జాఫర్.. తాజాగా ఇంగ్లండ్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చాడు. రెండేళ్ల క్రితం టీమిండియాను ఎగతాళి చేస్తూ వాన్ చేసిన ట్వీట్ను గుర్తు చేస్తూ మరి చురకలంటించాడు.
రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. నాలుగో వన్డేలో 92 పరుగులకే ఆలౌటైంది. దాంతో వాన్ ట్విటర్ వేదికగా టీమిండియా వైఫల్యాన్ని ఎగతాళి చేశాడు. '92 పరుగులకే భారత్ ఆలౌట్.. ఈ రోజుల్లో కూడా 100 పరుగుల్లోపు ఓ జట్టు ఆలౌటవ్వడం నమ్మలేకపోతున్నా'అని ట్విటర్ వేదికగా ఏతులు కొట్టాడు.
అయితే యాషెస్ సిరీస్లో భాగంగా మూడో టెస్ట్లోనూ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. రెండున్నర రోజుల లోపే ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ను అతిథ్య ఆస్ట్రేలియా సంపూర్ణ ఆధిపత్యంతో ఏకపక్షంగా ముగించింది. మ్యాచ్ మొత్తంలో ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేపోయిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో అరంగేట్ర బౌలర్ స్కాట్ బోలాండ్(6/7) ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది.
ఇక ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌటవ్వడాన్ని ప్రస్తావిస్తూ.. మైకేల్ వాన్పై వసీం జాఫర్ సెటైర్లు పేల్చాడు. ఓ వీడియోను ట్వీట్ చేసిన అతను.. అందులో తన మొబైల్లో మైకేల్ వాన్ చేసిన '100 పరుగుల్లోపు ఆలౌటవుతారా?'అని ట్వీట్ను చూపించాడు. ఈ వీడియోకు ఇంగ్లండ్ 68 ఆలౌట్ అనే క్యాప్షన్తో మైకేల్ వాన్కు ట్యాగ్ చేశాడు..ఈ వీడియో ట్వీట్ చూసిన వాన్.. తన తలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక.. 'వెరీ గుడ్ వసీం'అంటూ కవర్ డ్రైవ్ వేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
వరుసగా మూడు మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. యాషెస్ సిరీస్ను కోల్పోయింది. తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్లో చెత్త బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 185 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోరూట్(50) మినహా అంతా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్, నాథన్ లియోన్ మూడేసి వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 267 పరుగులకు ఆలౌటై 82 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఇక 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 68 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.