కరాచీ: పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్లపై ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్తో తనకు విభేదాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. పని పాట లేని వెదవలు క్రియేట్ చేసిన స్టోరీలని మండిపడ్డాడు. బాబర్ ఆజామ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అతను తన కొడుకుతో సమానమని స్పష్టం చేశాడు. వసీం అక్రమ్తో ఉన్న విభేదాల కారణంగానే బాబర్ ఆజామ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్లో కరాచీ కింగ్స్ను వదిలి పెషావర్ జల్మీకి మారాడని కథనాలు వెలువడ్డాయి.
'నేను బాబర్ ఆజామ్ ఆటపై ఎప్పుడూ అసంతృప్తి వక్తం చేయలేదు. కానీ కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. ఈ స్టోరీలను వాళ్లే వండి వార్చుతారు. వాళ్ల పనేంటంటే.. 24/7 ట్విటర్లో ఉండి ఇటువంటివి రాస్తుండటమే. వాళ్లు అన్నం తినరు. టీలు తాగరు. ట్విటర్లో ఇవే వండుతూ కడుపు నింపుకుంటారు. నా జీవితంలో ఇటువంటి వాళ్లను ఒక్కసారి కూడా కలవలేదు. ఫ్రాంచైజీ క్రికెట్లో ఆటగాళ్లు జట్లు మారడం సర్వసాధారణం. అది ఫ్రాంచైజీ ఓనర్ల మీద ఆధారపడి ఉంటుంది. నా మీద కాదు. ఇవన్నీ ఏం పనిలేనివాళ్లు పుట్టించే పుకార్లు. నేను బాబర్తో నిత్యం టచ్ లోనే ఉంటా. అతడు నా కొడుకుతో సమానం. బాబర్తో నాకు విభేదాలు ఏం ఉంటాయి? అతనికి నా పూర్తి మద్దతు ఉంటుంది.'అని వసీం అక్రమ్ స్పష్టం చేశాడు.
వరుస వైఫల్యాల నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజామ్ను తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతుండగా.. వసీం అక్రమ్ మాత్రం అతనికి అండగా నిలిచాడు. 'మనం మన కెప్టెన్ కు మద్దతుగా నిలవాలి. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. నేను ఏడుగురు సారథుల దగ్గర పనిచేశాను. మన కెప్టెన్ కు అనుభవరాహిత్యం ఉందని, అందుకే అతడు మ్యాచ్ లు ఓడిపోతున్నాడని బాబర్ ను ఆ బాధ్యతల నుంచి తొలగించడం కరెక్ట్ కాదు. బాబర్కు మనం మద్దతివ్వాలి. 'అని అక్రమ్ చెప్పుకొచ్చాడు.