'పాకీ' అని పిలిచారు
తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడుతూ... 'ఏదో ఒక దశలో మేం (క్రికెటర్లు) కూడా వివక్ష బాధితులమే. ఇంగ్లండ్ క్రికెట్ లీగ్లో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టులోని ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నన్ను 'పాకీ' అని పిలిచారు. నేను నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్నప్పటికీ వాళ్లు పదేపదే అదే పదంతో సంబోధిస్తూ అవమానించారు. పాకిస్థాన్ను పాకీగా పిలుస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గోధుమ రంగులో ఉన్న వారిపై, ఆసియా ఉపఖండానికి చెందిన వారిపై వర్ణవివక్ష చూపిస్తూ పాకీ అని హేళన చేస్తారు.. ఇంగ్లండ్లో ఎవరైనా నిన్ను పాకీ అని అంటే.. వాళ్ల ఉద్దేశం ఏంటో మనకు సులువుగా అర్థమైపోతుంది. ఆ సమయంలో నాకు జట్టు అండగా నిలిచింది' అని చెప్పాడు.
మెర్లేబోన్ క్రికెట్ క్లబ్ తరఫున ప్రాతినిధ్యం:
కొంత మంది అసభ్య ప్రవర్తనతో శ్వేతజాతీయులు వివక్షను ఎదురుచూసిన సంఘటనలు ఉన్నాయని 42 ఏళ్ల ఆకాశ్ చోప్రా అన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ సైమండ్స్ భారత పర్యటనకు వచ్చినప్పుడు వాంఖడే స్టేడియంలో ప్రేక్షకులు దూషిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆకాశ్ గుర్తుచేశాడు. 2007లో మెర్లేబోన్ క్రికెట్ క్లబ్ తరఫున చోప్రా ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఐపీఎల్లో వివక్షతో కూడిన వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడినప్పుడు తనని, శ్రీలంక ఆటగాడు పెరీరాను కొంతమంది ఆటగాళ్లు 'కాలు' అని పిలిచేవాళ్లని తెలిపాడు.
గేల్, బ్రావో మద్దతు
డారెన్ సామీకి సహచర ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో మద్దతు పలికారు. వివక్షపై పోరాడాలని గేల్, బ్రావో ట్వీట్ చేశారు. 'సరైన విషయం కోసం పోరాడేందుకు సమయం మించిపోలేదు. ఎన్నో ఏళ్లుగా చవిచూస్తున్న ఈ చేదు అనుభవాలపై పోరాడుతూనే ఉండాలి. నీ కథలాగే చాలా ఉన్నాయి. గతంలో నేను చెప్పినట్టు కూడా క్రికెట్లో వివక్ష ఉంది' అని గేల్ ట్వీట్ చేశాడు. 'నల్లజాతీయులు ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి నాకు తెలుసు. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని మేం అనుకోవడం లేదు. అయిందేదో అయింది. ఇకనుంచైనా మాకు సమానత్వం, గౌరవం ఇవ్వాలని కోరుతున్నా' అని బ్రావో పోస్ట్ చేశాడు.
10 టెస్టులు మాత్రమే:
ఆకాశ్ చోప్రా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక ఏడాది మాత్రమే భారత్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన చోప్రా.. 10 టెస్టులాడి 23 సగటుతో 437 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఇక 2004లో కెరీర్ని ముగించిన చోప్రా.. కనీసం ఒక్క వన్డే కూడా ఆడలేదు. అనంతరం మ్యాచ్ కామెంటేటర్గా మాత్రం సుదీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతున్నాడు.