న్యూఢిల్లీ: ప్రపంచకప్ ముందు భారత్ అండర్-19 కుర్రాళ్లు సాధించిన ఆసియా కప్ విజయం వాళ్ల ఆత్మవిశ్వసాన్ని పెంచుతుందని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ప్రతికూల పరిస్థితుల వల్ల సరైన సన్నాహకం లేనప్పటికీ భారత్ అండర్-19 కుర్రాళ్లు అద్భుత విజయాన్నందుకున్నారని ప్రశంసించారు. ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన యువ భారత్ రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో కుర్రాళ్లపై లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. ఈ నెల 14న వెస్టిండీస్లో ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచకప్కు ముందు ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపాడు. ''ఆసియా కప్ను సొంతం చేసుకున్న భారత్ అండర్-19 జట్టుకు అభినందనలు. ప్రతికూల వాతావరణంతో పాటు ఇతర కారణాల వల్ల ఈ టోర్నీకి ముందు వాళ్ల సన్నాహకం దెబ్బతింది.
కానీ ఈ కుర్రాళ్లు మ్యాచ్ మ్యాచ్కూ మెరుగవుతుంటే చూడడం గొప్పగా ఉంది. అది టైటిల్ విజయంతో సమానంగా సంతృప్తినిస్తోంది. అండర్-19 ప్రపంచకప్కు ముందు ఈ గెలుపు వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది'' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
శుక్రవారం ముగిసిన అండర్-19 ఆసియా కప్లో భారత్ టైటిల్ చేజిక్కించుకుంది. ఫైనల్లో యువ భారత్ 9 వికెట్ల తేడాతో శ్రీలంక అండర్-19 జట్టును చిత్తు చేసింది. భారత అండర్-19 టీమ్ ఆసియా కప్ను గెలుచుకోవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 38 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. రోడ్రిగో (19 నాటౌట్)దే అత్యధిక స్కోరు. లంక స్కోరు 33 ఓవర్లకు 74/7 ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. దాంతో మ్యాచ్ను 38 ఓవర్లకు కుదించారు. విరామం తర్వాత లంక తర్వాతి 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి మరో 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో విక్కీ ఒస్వాల్ 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, కౌశల్ తాంబేకు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం 'డక్వర్త్ లూయిస్' ప్రకారం భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (5) ఆరంభంలోనే వెనుదిరిగినా... అంగ్రిష్ రఘువంశీ (67 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు), ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (49 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు అభేద్యంగా 96 పరుగులు జోడించారు.