స్కిల్స్ ఉంటే సరిపోదు..
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం తమ నైపుణ్యాలనే కాకుండా.. ఆట కోసం సన్నద్ధమవ్వడం, ప్రణాళికలు రూపొందించడం, వాటిని పక్కాగా అమలు చేయడం కూడా ముఖ్యమని వీవీఎస్ పేర్కొన్నాడు. అశ్విన్ వీటన్నింటిపైనా దృష్టి సారిస్తాడని, అందుకే అతడు అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. 'అశ్విన్ చాలా తెలివైన ఆటగాడు. హయ్యెస్ట్ లెవల్లో ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు కేవలం తమ నైపుణ్యాలపైనే కాకుండా.. ఆట కోసం సన్నద్దమవ్వడం, ప్రణాళికలు రూపొందించడం ఎంతో ముఖ్యం. అశ్విన్ వీటిని బాగా ఫాలో అవుతాడు.
అశ్విన్ పక్కా ప్లాన్తో..
బ్యాట్స్మెన్ బలహీనతలు తెలుసుకుంటాడు. వాటిపై బాగా ప్రాస్టీస్ చేస్తాడు. అలాగే కచ్చితమైన ప్రణాళికలు అమలు పరుస్తాడు. అందువల్లే తనని తాను మరింత బాగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతని నుంచి మెరుగైన ప్రదర్శన చూశాం. స్టీవ్స్మిత్ లాంటి గొప్ప బ్యాట్స్మన్ను ఎలా ఇబ్బంది పెట్టాడో గమనించాం. ఇలాంటివే అతన్ని ఛాంపియన్గా మారుస్తాయి. ఈ విధంగానే అశ్విన్ అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. అలాగే బలమైన జట్లతోనే పోటీపడాలనుకుంటాడు' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్..
అనంతరం ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. అశ్విన్ రాక్స్టార్ అని, అతను టీమిండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు.'టీమిండియా తరఫున కుంబ్లే నంబర్ వన్ బౌలరైనా అశ్విన్ కూడా బాగా రాణిస్తున్నాడు. 77 టెస్టుల్లోనే 400 వికెట్లు పడగొట్టాడు అంత ఆశామాషి వ్యవహారం కాదు. కొంత కాలంగా అతను బంతితో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అసాధారణ బౌలింగ్తో రోజు రోజు మరింత మెరుగవుతున్నాడు. ఎలాంటి విమర్శలు వచ్చినా బంతితోనే బదులిస్తున్నాడు. నాకు అతను ఓ రాక్ స్టార్లా కనిపిస్తున్నాడు. భారత్ తరఫున బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్గా నిలుస్తున్నాడు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.
అశ్విన్ 400 వికెట్లు..
ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగు టెస్ట్ల సిరీస్లో అశ్విన్ 400 వికెట్ల మైలు రాయి అందుకున్న విషయం తెలిసిందే. మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో బెన్ స్టోక్స్, ఓలి పోప్, జోఫ్రా ఆర్చర్లను పెవిలియన్కు చేర్చి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్గా గుర్తింపు పొందాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ తర్వాత అశ్వినే వేగంగా 400 వికెట్ల క్లబ్లో చేరాడు. బంతితోనే కాకుండా బ్యాట్తోనూ అశ్విన్ అలరిస్తున్నాడు. చెన్నై వేదికగా జరిగిన సెకండ్ టెస్ట్లో సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభంకానుంది.