న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతన్ని పక్కనపెట్టి రిషభ్ పంత్ను ఆడించాలని రోహిత్ సేనకు చూపించాడు. దినేశ్ కార్తీక్.. ఆస్ట్రేలియా బౌన్స్ పిచ్లపై ఆడలేదని, అక్కడ బెంగళూరు తరహా పిచ్లుండవన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై రిషభ్ పంత్కు మంచి అనుభవం ఉందని, బౌన్సీ వికెట్ అతని బ్యాటింగ్ శైలికి సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ ఆడిన గబ్బా ఇన్నింగ్స్కే దీనికి నిదర్శనమని చెప్పాడు.
సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తీక్(6) దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్తో 6వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతను 15 బంతులాడి 6 పరుగులు చేయడాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. క్రిక్ బజ్ చానెల్లో భారత ఇన్నింగ్స్ను విశ్లేషించిన సెహ్వాగ్.. పంత్ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. సౌతాఫ్రికాతో దీపక్ హుడా బదులు రిషభ్ పంత్ను ఆడించాల్సిందని పేర్కొన్నాడు.
'పాకిస్థాన్తో మ్యాచ్ నుంచే దినేశ్ కార్తీక్కు బదులు రిషభ్ పంత్ను ఆడించాల్సింది. పంత్కు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అతను ఆసీస్ గడ్డపై అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియాలో దినేశ్ కార్తీక్ చివరిసారిగా ఎప్పుడు ఆడాడు? ఇక్కడేం బెంగళూరు తరహా పిచ్లుండవు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో కూడా దీపక్ హుడా బదులు పంత్ను ఆడించాల్సింది.
అతను ఇక్కడ ఆడిన అనుభవం జట్టుకు ఉపయోగపడుతోంది. పంత్ గబ్బా ఇన్నింగ్స్ మరవలేనిది. నేను కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలను. టీమ్మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కార్తీక్ ఫిట్గా ఉంటే మళ్లీ అతనికే అవకాశం ఇస్తారు. నా అభిప్రాయం ప్రకారం మాత్రం కార్తీక్ బదులు రిషభ్ పంత్ను ఆడించడమే సరైనది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో రనౌటైన కార్తీక్.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 6 పరుగులే చేయడంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే సఫారీ మ్యాచ్లో కార్తీక్ గాయపడ్డాడు. అతని పక్కటెముకలు పట్టేయడంతో మైదానం వదిలేయగా.. పంత్ కీపింగ్ చేశాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో బుధవారం జరగనున్న మ్యాచ్కు అతను దూరమయ్యే అవకాశాలున్నాయి.