Virender Sehwag: ఆ ఆర్సీబీ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ జట్టులోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వచ్చు!

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు భారత ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. యూఏఈ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సెకండాఫ్లో అద్భుత ప్రదర్శన కనబర్చితే అతన్ని జట్టులోకి తీసుకోవచ్చన్నాడు. అక్టోబర్లో ప్రారంభమయ్యే పొట్టి ప్రపంచకప్లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్ 10 వరకు జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ రెండో దశలో సత్తా చాటే ఆటగాళ్లకు టీమిండియాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుత ఐపీఎల్లో రాణించగలిగితే దేవదత్ పడిక్కల్ సహా సంజూ శాంసన్లను భారత సెలెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకునే అవకాశముందని తెలిపాడు. పొట్టి ఫార్మాట్లో ఇషాన్ కిషన్, దేవ్దత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ లాంటి యువ ఆటగాళ్ల ఆటను ఆస్వాదిస్తానని.. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం వస్తే కచ్చితంగా పడిక్కల్వైపే మొగ్గుచూపుతానని పేర్కొన్నాడు. పడిక్కల్ బ్యాటింగ్ శైలీ చాలా బాగుంటుందని.. పొట్టి క్రికెట్కు అతను సరైన అటగాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా, గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పడిక్కల్.. సెహ్వాగ్ లాగే డాషింగ్ ఆటతీరుతో వేగంగా పరుగులు రాబట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్-2021 ఫస్టాఫ్లో అతను సాధించిన సూపర్ సెంచరీ.. సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. ఆ ప్రదర్శనతో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 21 మ్యాచ్లు ఆడిన పడిక్కల్.. 5 హాఫ్ సెంచరీలు, సెంచరీ సాయంతో 668 పరుగులు చేశాడు.
కోహ్లీ ఒక్కసారైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలి తాను కోరుకుంటున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. అయితే ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ బాగానే ఆడినా.. యూఏఈలో వెనకపడిపోయే అవకాశం ఉందన్నాడు. 'ఐపీఎల్ అనేది ప్రతి సారథికి ముఖ్యమైనదే. అది విరాట్ కోహ్లీకి మరింత ముఖ్యమైందని నేను భావిస్తాను. ఎందుకంటే.. అతనికి విపరీతమైన అభిమాన గణం ఉంది. ప్రతిఒక్కరూ అతను ఆర్సీబీకి ట్రోఫీ అందించాలని కోరుకుంటారు. కనీసం ఒక్కసారైనా అది సాధించాలని ఆశిస్తారు.
ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఈ ఏడాది బెంగళూరు విజేతగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు. అయితే యూఏఈలోని స్లో పిచ్లు బెంగళూరుకు ఇబ్బందిగా మారొచ్చు. యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో గతేడాది లాగే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. అక్కడి స్లో పిచ్లు బెంగళూరుతో సహా చెన్నైకి కూడా ఇబ్బందిగా మారొచ్చు.' అని మాజీ ఓపెనర్ సెహ్వాగ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications