33 పరుగుల ఆధిక్యం..
ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆటలో పరిపక్వత ప్రదర్శిస్తూ.. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లా చెలరేగారు. అప్పటి వరకు ఆధిపత్యం చెలాయించిన ఆసీస్.. ఈ ఇద్దరు పోరాటానికి చేతులెత్తేసింది. వీరిని ఔట్ చేయడానికి అస్త్రశస్త్రాలను ఉపయోగించింది. చివరకు కమిన్స్ పుణ్యాన ఫలితం రాబట్టి భారత ఇన్నింగ్స్ను 336 పరుగులకు ముగించి 33 పరుగుల స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ వార్నర్(20 బ్యాటింగ్), మార్కస్ హరిస్(1) ఉన్నారు.
|
మీ పోరాటం అద్భుతం
ఇక శార్దూల్, సుందర్ పోరాటపటిమపై అటు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, ఇటు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్న అసలైన ఆటగాళ్లని, వారి పోరాటం అద్వితీయమని సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ అందర్ని ఆకట్టుకోవడంతో పాటు ఓ చర్చకు దారితీసింది. అతను చెప్పిన లెక్క ప్రకారం గబ్బాలో భారత్ విజయకేతనం ఎగరేస్తుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
సెహ్వాగ్ ట్వీట్ ఏంటంటే..?
వాషింగ్టన్ సుందర్, శార్దుల్ అసాధారణ పోరాటాన్ని కొనియాడుతూ సెహ్వాగ్.. 2003 అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో కూడా భారత్ తొలి ఇన్నింగ్స్లో 33 పరుగులే వెనుకబడిందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని తెలిపాడు. ఓ దశలో 133 పరుగుల ఆధిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్కు శార్దుల్, వాషింగ్టన్ సూపర్బ్ బ్యాటింగ్తో 33 పరుగుల లీడ్ మాత్రమే దక్కిందన్నాడు. ఆసీస్ నలుగురు బౌలర్లకు 1000 వికెట్లు తీసిన అనుభవం ఉండగా.. గబ్బా టెస్టులో టీమిండియా ఐదుగురు బౌలర్లకు 11 వికెట్లు తీసిన అనుభవమే ఉన్నా వారి అద్భుత ఆటతీరు జబర్దస్త్గా ఉందని కొనియాడాడు. అయితే 2003 నాటి అడిలైడ్ టెస్టులో భారత్ విజయం సాధించింది. దాంతో అభిమానులు సెహ్వాగ్ చెప్పినట్లు గబ్బాలో భారత్ గెలుస్తుందని, ఆ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టెస్ట్ క్రికెట్ అంటే ఇదే..
ఇక శార్దుల్, వాషింగ్టన్ పోరాటాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడాడు. ఈ యువ ఆటగాళ్లను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. 'సుందర్, వాషింగ్టన్ అద్భుత ప్రదర్శన చేశారు. తమ నమ్మకాన్ని నిలబెట్టారు. టెస్ట్ క్రికెట్ అంటేనే ఇది. అరంగేట్రంలో వాషింగ్టన్ అదరగొట్టాడు. శార్దూల్ అందర్ని మెప్పించాడు.'అని మరాఠీలో రాసుకొచ్చాడు. ఇతర మాజీ క్రికెటర్లు కూడా ఈ యువ ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఇక గబ్బాలో ఆసీస్కు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఆ జట్టు ఓడిపోలేదు. మరోవైపు భారత్ కూడా ఒక్కసారి గెలవలేదు. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్ గెలవడంతో పాటు చరిత్ర తిరగరాసినట్లు అవుతుంది.