కావాలనే దూరంగా కోహ్లీ
మ్యాచ్ రోజు ఉదయమే నొప్పి తీవ్రత పెరగడంతో అతను తప్పుకున్నాడు. అయితే చివరి క్షణంలో విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ రోజు కూడా కోహ్లీ మైదానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దాంతో విరాట్ కావాలనే ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పెద్దల పట్ల కోహ్లీ ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనకు వచ్చే ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. సెలెక్టర్ల నుంచి తనకు సరైన సమాచారం అందలేదన్నాడు. అంతేకాకుండా తననెవరూ టీ20 కెప్టెన్గా కొనసాగాలని కోరలేదని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీతో పాటు ఇతర పెద్దలను ఇరకాటంలో పెట్టాడు.
చేతన్ శర్మ కామెంట్స్తో..
ఇక సౌతాఫ్రికా పర్యటనలో 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన సందర్భంగా సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ టీ20 కెప్టెన్గా తప్పుకొంటానని చెప్పినప్పుడే వద్దని చెప్పామని, జట్టు కోసం కొనసాగాలని కోరామని పేర్కొన్నాడు. 'సెప్టెంబర్లో విరాట్ తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడూ మా అందరికీ ఆశ్చర్యమేసింది. ఆ సమావేశంలో పాల్గొన్న వారంతా కోహ్లీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. తన నిర్ణయం టీ20 ప్రపంచకప్లో జట్టుపై ప్రభావం చూపుతుందని, అలాంటప్పుడు జట్టు కోసమైనా సారథిగా కొనసాగమని కోరాం. ప్రతి ఒక్కరూ అతనికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమావేశంలో బోర్డు అధికారులతో సహా అందరూ ఉన్నారు. అయినా కోహ్లీ తన నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో మేం దాన్ని కాదనలేకపోయాం'అని చేతన్ వివరించాడు.
మీడియా ముందు దోషిగా..
అయితే టీ20 కెప్టెన్సీ వదులుకుంటే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందని విరాట్కు చెప్పారా? అని మీడియా ప్రశ్నించగా.. ఆ సమయంలో అలా చెప్పడం సరైందిగా భావించలేదని చేతన్ శర్మ బదులిచ్చాడు. అలా చెబితే జట్టుపై ప్రభావం చూపుతుందని భావించామని, ప్రపంచకప్ తర్వాత కూడా టీ20 సారథ్యంపై పునరాలోచించుకోవాలని కోరాం'చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే తనను మీడియా దోషిగా భావించేలా వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మ పట్ల కోహ్లీ ఆగ్రహంగా ఉన్నాడని, దాంతోనే మ్యాచ్కు దూరంగా ఉండి తన అసంతృప్తిని తెలియజేస్తున్నాడనే వాదన వినిపిస్తోంది.
తాను లేకుంటే గెలుస్తారా?
బీసీసీఐ, తనకు మధ్య జరుగుతున్న అంతర్యుద్దంలో భాగంగా తాను లేకుండా టీమిండియా గెలుస్తుందా? లేదా అనేది చూడాటానికి కోహ్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే కోహ్లీ వెన్ను పైభాగంలో నొప్పితో బాధపడటం ఇది మొదటిసారి కాదు. 2018లోనూ అతనికి ఇదే సమస్య రావడంతో కౌంటీ క్రికెట్కు దూరమయ్యాడు. అంతా షెడ్యూల్ ప్రకారం సాగితే ఫిబ్రవరిలో శ్రీలంకతో బెంగళూరుతో జరిగే మ్యాచ్ అతనికి 100వ టెస్ట్ అవుతుంది. అయితే వన్డే సిరీస్కు కూడా కోహ్లీ దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కేప్టౌన్ టెస్ట్కు ముందు కోహ్లీ మీడియా సమావేశానికి వస్తే అన్నిటికీ సమాధానం దొరకనుంది.