|
గుండె తరుక్కుపోతుంది..
'అందమైన అమ్మ, అక్క.. ఇంట్లోని మేమందరం గత కొన్ని రోజులుగా దుఃఖంలో మునిగిపోయాం. మన ఇంటికి మీ ఇద్దరే పునాది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మీరు నాతో లేరని తెలిసి నా హృదయం ముక్కలవుతోంది. అమ్మా.. నువ్వు నన్ను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దావు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేర్పావు. ఆ లక్షణాన్ని నాకు అందించింది కచ్చితంగా నువ్వే.
నాకెప్పటికీ తెలిసిన అందమైన, ఆనందమైన, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన చెల్లిని నేనని నాకు తెలుసు. నువ్వొక యోధురాలివి. చివరి నిమిషం దాకా ఎలా పోరాడాలో నాకు నేర్పించావు.
నా ప్రతి మాటలో..
మీరిద్దరూ.. నా ప్రతిమాటలో.. నేను చేసే ప్రతిపనిలో సంతోషం వెదుక్కునే వారు. మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదని ఇప్పుడు తెలుస్తోంది. మీతో చివరి రోజులను ఎంతో సంతోషంగా గడిపా. కానీ అవే ఆఖరి క్షణాలు అవుతాయని అనుకోలేదు. మీరిద్దరు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిన తర్వాత నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో అంతే మిస్సవుతున్నాను కూడా.. నాకింతటి ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు.
వైరస్ చాలా డేంజర్..
నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే మనస్సు తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి''అని వేద విజ్ఞప్తి చేశారు. కాగా బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడి.. 829, 875 పరుగులు చేసింది.