యశస్వీ ఒక్కడే..
టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తుదిసమరంలోను అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తించే బంతులతో విరుచుకుపడినా సహనంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ప్రారంభంలోనే సహచర ఓపెనర్ దివ్యాన్ష్ సక్సెనా వికెట్ కోల్పోయినా క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో బాధ్యాతాయుతంగా ఆడిన జైస్వాల్.. కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
6 ఓవర్లు 8 పరుగులు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. పిచ్ బౌలింగ్కు సహకరిస్తుండటంతో ఆచితూచి ఆడింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో ఆతిథ్య పేసర్లు చెలరేగారు. దీంతో భారత ఓపెనర్లు తొలి రెండు ఓవర్లను మెయిడిన్ చేశారు. అనంతరం మూడో ఓవర్లో కూడా పరుగులు రాకపోవడంతో భారత్ 6 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 పరుగులే చేసింది. ఇక ఏడో ఓవర్లో దివ్యాన్ష్ ఔటవ్వగా.. మరుసటి ఓవర్లో యశస్వీ బౌండరీల ఖాతా తెరిచాడు.
ఆ వెంటనే సింగిల్ తీసే క్రమంలో ఫీల్డర్ విసిరిన బంతి తిలక్ మోకాలి తగలడంతో మైదానంలో కుప్పకూలాడు. ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేయడంతో బ్యాటింగ్కు సిద్దమైన తిలక్ పరుగు తీయడంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. దీంతో పవర్ ప్లే ముసిగే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.
కీలక భాగస్వామ్యం..
బంగ్లా బౌలర్లను ఆచితూచిగా ఎదుర్కొన్న జైస్వాల్-తిలక్ నిదానంగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డ బంతులను బౌండరీలకు తరలిచింది. 16 ఓవర్లో చెరొక ఫోర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. మరికొన్ని ఓవర్లపాటు నిదానంగా ఆడిన జోడీ రన్ రేట్ తగ్గకుండా సింగిల్స్ తీస్తూ జాగ్రత్తపడింది. ఈ క్రమంలో హసన్ షకీబ్ బౌలింగ్లో సింగిల్ తీసిన యశస్వి 89 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ టోర్నీలో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషమైతే.. ప్రతీ మ్యాచ్లో 50కి పైగా పరుగులు చేయడం మరో విశేషం. మొత్తం 6 ఇన్నింగ్స్ల్లో 88,105, 62,57 నాటౌట్, 29 నాటౌట్, 57, పరుగులు చేయడం గమనార్హం.
ఆ వెంటనే యశస్వీ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. భారీ షాట్కు ప్రయత్నించిన తిలక్ వర్మ(38) బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్రియమ్ గార్గ్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అనంతరం ధృవ్ జురేల్ క్రీజులోకి రాగా.. యశస్వీ ఆచితూచి ఆడాడు.
యశస్వీ ఔట్.. టపటపా..
42 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఫామ్ కనబర్చిన యశస్వీ-ధృవ్ జోడీని షోరిఫుట్ విడదీసాడు. వరుస బంతుల్లో యశస్వీ, సిద్దేశ్లను పెవిలియన్ చేర్చి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు.
యశస్వీ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరగా.. సిద్ధేశ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే అంకోలేకర్తో సమన్వయ లోపంతో ధృవ్ రనౌట్గా పెవిలియన్ చేరాడు.
ఆ వెంటనే రవి బిష్టోయ్(2), అంకోలేకర్(3), సుశాంత్ మిశ్రా(3), కార్తీక్ త్యాగి(0) వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. యశస్వి ఔటైన అనంతరం 21 పరుగుల వ్యవధిలోనే భారత్ ఇన్నింగ్స్ ముగియడం గమనార్హం.