
పాచెఫ్స్టూమ్(సౌతాఫ్రికా): భారత మహిళల క్రికెట్లో సంచలన విజయం నమోదైంది. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ టైటిల్ను భారత మహిళల అండర్-19 టీమ్ గెలిచి చరిత్ర సృష్టించింది. సుదీర్ఘకాల నిరీక్షణకు తెరదించుతూ.. అరంగేట్ర అండర్ 19 ప్రపంచకప్లోనే అద్భుత విజయాన్నందుకుంది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత అండర్19 మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళల క్రికెట్లో ఏ విభాగంలోనైనా భారత జట్టుకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం విశేషం.
సీనియర్ మహిళల టీమ్ మూడు సార్లు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరినా.. టైటిల్ అందుకోలేకపోయింది. కానీ షెఫాలీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లు టిటాస్ సధు, అర్చనా దేవి, పర్షావి చోప్రా రెండేసి వికెట్లు తీయగా.. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ర్యానా మాక్డోనాల్డ్(19) టాప్ స్కోరర్గా నిలవగా.. ముగ్గురు బ్యాటర్లు డకౌటవ్వడం విశేషం.
ఈ టోర్నీలో ఫైనల్తో కలిపి మొత్తం 7 మ్యాచ్లు ఆడిన షెషాలీ సేన.. ఆస్ట్రేలియాతో మినహా ప్రతీ మ్యాచ్ గెలిచింది. సూపర్-6లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీగ్ దశలో సౌతాఫ్రికా, యూఏఈ , స్కాట్లాండ్ టీమ్స్ను ఓడించిన భారత్.. సూపర్-6లో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్కు కొరకరాని కొయ్యగా ఉన్నన్యూజిలాండ్ను మట్టికరిపించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. చారిత్రాత్మక విజయాన్నందుకున్న షెఫాలీ సేనకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.