భారత్ పోరాటం అద్భుతం..
'సిరీస్ గెలవాలని గబ్బాకు వచ్చాం. కానీ పేలవ ప్రదర్శన చేశాం. మా లోపాలపై దృష్టిసారించాల్సి ఉంది. బలమైన జట్టు అయినప్పటికీ మంచి ప్రదర్శన చేయలేకపోయాం. ఎన్నో విభాగాల్లో మెరుగవ్వాలి. 300 పరుగులు చేసి సిరీస్ను సాధించాలనుకున్నాం. కానీ భారత్ గొప్పగా పోరాడింది. శరీరంపైకి వస్తున్న బంతుల్ని టీమిండియా బ్యాట్స్మెన్ గొప్పగా ఎదుర్కొన్నారు. విజయానికి వారే పూర్తి అర్హులు. మా బౌలర్లు ప్రయత్నించినప్పటికీ టీమిండియా అద్భుత ప్రదర్శనతో సిరీస్ సాధించింది'అని టిమ్ పైన్ చెప్పుకొచ్చాడు.
చిరస్మరణీయ విజయం..
ఇక ఇది తమకు చిరస్మరణీయ విజయమని టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే అన్నాడు. 'ఈ విజయం చిరస్మరణీయం. ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు. అడిలైడ్ ఓటమి తర్వాత అద్భుత ప్రదర్శనతో తామేంటో మా ఆటగాళ్లు చాటిచెప్పారు. ప్రతి ఒక్కరి పాత్రను అభినందిస్తున్నా. ఎంతో తీవ్రతతో ఆడారు. ఇక ఆఖరి రోజు ఆటలో పుజారాకు క్రెడిట్ ఇవ్వాలి. ఇద్దరం చర్చించుకున్నాం. అతడు నిలకడగా ఆడితే, నేను కాస్త దూకుడుగా ఆడాలనుకున్నాం. అయితే పుజారా ఒత్తిడిని గొప్పగా అధిగమించాడు. ఆఖర్లో పంత్, సుందర్ అద్భుతంగా ఆడారు.
అదే వ్యూహంతో..
'ఇక్కడ విజయం సాధించాలంటే 20 వికెట్లు సాధించాలి. అందుకే అయిదుగురు బౌలర్లతో బరిలోకి దిగాం. జడేజా స్థానాన్ని సుందర్ గొప్పగా భర్తీచేశాడు. సిరాజ్ రెండు టెస్టులు, సైని ఒక టెస్టు ఆడాడు. మా బౌలర్లకు అనుభవం లేదు. అయినా అద్భుత ప్రదర్శన చేశారు. అయితే అడిలైడ్ ఓటమి తర్వాత దాని గురించి మేం చర్చించుకోలేదు. మిగిలిన మ్యాచ్లపైనే దృష్టిసారించాం. ఫలితాలపై ఆలోచించకుండా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలనుకున్నాం' అని అజింక్య రహానే చెప్పుకొచ్చాడు.
చారిత్రాత్మక విజయం..
1988 తర్వాత బ్రిస్బేన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని ఆస్ట్రేలియాకు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ చారిత్రక విజయాన్ని సాధించి బోర్డర్-గావస్కర్ సిరీస్ ట్రోఫీని నిలబెట్టుకుంది. నాలుగో ఇన్నింగ్స్లో 328 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ గిల్ (91), వికెట్ కీపర్ పంత్(89 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్కు తోడు పుజారా (56) అర్ధశతకంతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్(4), లైయన్ (2), హేజిల్వుడ్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.