మైఖేల్ వాన్ సెటైర్లు:
ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ చిత్తుచిత్తుగా ఓడింది. ఈ ప్రదర్శనపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ కామెంటేటర్ మైఖేల్ వాన్ సెటైర్లు వేశాడు. మెగా టోర్నమెంట్లో భారత్ ఆడుతున్న తీరు సరిగా లేదన్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 నుంచి కోహ్లీసేన నిష్క్రమించే దశలో ఉందన్నాడు. అద్భుతమైన నైపుణ్యం ఉన్న భారత జట్టు.. టోర్నీలో ఆడుతున్న తీరు ఏమాత్రం బాగాలేదన్నాడు. భారత ఆటగాళ్ల మైండ్సెట్, మ్యాచ్లో వాళ్లు ప్రదర్శిస్తున్న వైఖరి తప్పుడుగా ఉందని మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. టీ20 ఆడే విధానం మారిపోయినా.. 2010 క్రికెట్ తరహాలో భారత్ ఆడుతోందని విమర్శించాడు.
2010లో ఆడినట్టే ఆడుతోంది:
భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఓ ట్వీట్ చేశాడు. 'టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించే దశలో ఉంది. ఎంతో ట్యాలెంట్ ఉన్న టీమిండియా జట్టు.. టోర్నీలో ఆడుతున్న వైనం బాగాలేదు. ఆటగాళ్ల మైండ్సెట్, మ్యాచ్లో వాళ్లు ప్రదర్శిస్తున్న విధానం చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతం టీ20 క్రికెట్ ఆడే విధానం పూర్తిగా మారిపోయింది. అయినా కూడా భారత్ 2010లో ఆడినట్టే ఆడుతోంది. ఇలా అయితే విజయాలు సాధించడం కష్టమే' అని వాన్ వరుస ట్వీట్లు చేశాడు. 'భారత జట్టులో ట్యాలెంట్ బాగుంది. కానీ వైట్బాల్ క్రికెట్లో చాన్నాళ్ల నుంచి భారత ఆటగాళ్లు పెద్దగా రాణించడంలేదు. వివిధ దేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్ల్లో ఇండియన్ ప్లేయర్లు ఆడే విధంగా అవకాశాలు ఇవ్వాలి. ఐపీఎల్ మినహా ఇతర లీగ్ల్లో భారత ప్లేయర్స్ ఆడడం లేదు. దాంతో వాళ్ల ట్యాలెంట్ వృధా అవుతోంది' అని వాన్ మరో ట్వీట్ చేశాడు.
విఫలమైన భారత బ్యాటర్లు:
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. లోకేశ్ రాహుల్ (18), ఇషాన్ కిషన్ (4), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9), రిషబ్ పంత్ (12) పూర్తిగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, సోధీ రెండు వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డారిల్ మిషెల్ (49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
నాకౌట్కు అర్హత సాధించాలంటే:
సూపర్-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన కోహ్లీసేన పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. కివీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్, నమీబియాలపై గెలిస్తే సెమీస్ చేరనుంది.ఇక భారత్ నాకౌట్కు అర్హత సాధించాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా జరగని పనే అని చెప్పాలి.