టీ20 ప్రపంచకప్ వాయిదా?:
టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుందనే ఊహాగానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆదేశాలు వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ఊతం లభించినట్లయింది. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం లాజిస్టిక్ సమస్యల కారణంగా అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన ప్రపంచకప్ను వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని, వారంలోపు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
వారంలో అధికారిక ప్రకటన:
'టీ20 ప్రపంచకప్ వాయిదాపై ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. ఇంగ్లండ్తో సిరీస్ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. అయితే సిరీస్ గురించి మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత నేరుగా అక్కడి నుంచే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ కోసం భారత్ చేరుకుంటారు. యూఏఈ లేదా ఆసియాలో ఇంకెక్కడైనా ఐపీఎల్ జరిగినా ఆసీస్ ఆటగాళ్లు ఇంగ్లండ్ నుంచే వెళ్లొచ్చని సీఏ భావిస్తోంది' అని ఆసీస్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆతిథ్యానికి కివీస్ సిద్ధం:
ఇక అక్టోబర్-నవంబర్ సమయాన్ని భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ కోసం కేటాయించే అవకాశముంది. కాగా ఐపీఎల్ 2020 సీజన్కు ఆతిథ్యమిచ్చేందుకు మరో దేశం ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఏఈ, శ్రీలంక దేశాలు మెగా లీగ్కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమని ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ వర్గాలే స్పష్టం చేశాయి. భారత్ వేదికగా నిర్వహించేందుకే తమ తొలి ప్రాధాన్యత అని తెలిపిన ఓ బీసీసీఐ అధికారి.. కివీస్ కూడా ఆతిథ్యమిచ్చేందుకు సిద్దమని ప్రకటించిందన్నారు.
బీసీసీఐ ముళ్లగుల్లాలు:
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించిన షెడ్యూల్పై బీసీసీఐ ముళ్లగుల్లాలు పడుతోంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని తొలుత ఏప్రిల్ 15కు వాయిదా వేసిన బీసీసీఐ ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసేసింది. దాంతో.. ఇప్పుడు అక్టోబరు- నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్కప్ వాయిదాపడితే.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో విదేశాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందనేదానిపై కూడా సమాలోచనలు చేస్తుంది.