హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా జైత్రయాత్రకు సౌతాఫ్రికా బ్రేక్ వేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సఫారీ టీమ్.. 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ అజేయ హాఫ్ సెంచరీతో సఫారీలను గెలిపించాడు. ఈ విజయం సౌతాఫ్రికా సెమీస్ అవకాశాలను మెరుగుపరచగా.. పాకిస్థాన్ను టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. భారత్, జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్.. నెదర్లాండ్స్పై తొలి విజయాన్నందుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో పాక్ ఓడటంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలోనే భారత్ చేతిలో సౌతాఫ్రికా పరాజయం ఆ జట్టుకు అవసరమైంది.
order placed for home delivery of pak team
— zomato (@zomato) October 30, 2022
కానీ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో ఆ జట్టు ఇంటిదారిపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాక్ తమ తదుపరి మ్యాచ్ల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలను ఓడించినా ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లే చేరుతాయి. అప్పుడు సెమీస్ చేరే అవకాశాలున్నా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన రన్రేట్ ఉండాలి. కానీ ఆ జట్టు ప్రస్తుత రన్ రేట్ దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జట్టును భారత ఫుడ్ డెలవరీ సంస్థ జొమాటో ట్రోల్ చేసింది. భారత్పై సౌతాఫ్రికా గెలిచిన వెంటనే... పాకిస్థాన్ జట్టును ఇంటికి పంపించేందుకు ఆర్డర్ తీసుకున్నామని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ భారత అభిమానులకు ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జొమాటో ట్వీట్ అదిరిందని కామెంట్ చేస్తున్నారు.
సౌతాఫ్రికాతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 68) విరోచిత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(4/29) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 137 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఎయిడెన్ మార్క్రమ్(41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52), డేవిడ్ మిల్లర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, అశ్విన్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.