T20 World Cup 2022: పాక్X ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్కు వర్ష గండం.. మ్యాచ్ రద్దయితే?

మెల్బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 తుది దశకు చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఏ మాత్రం ఆశల్లేని స్థితి నుంచి సంచలన ఆటతో పాకిస్థాన్ ఫైనల్ చేరగా.. మరోవైపు భారత్ను చిత్తు చేసి ఇంగ్లండ్ దూసుకొచ్చింది. ఈ రెండు జట్లు ప్రతిష్టాత్మక మెల్ బోర్న్ వేదికగా టైటిల్ ఫైట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సమష్టి ప్రదర్శనతో రాణించి టైటిల్ ముద్దాడాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 1992 వన్డే ప్రపంచకప్లో ఇరు జట్లు ఇదే వేదికపై తలపడగా.. పాక్ విజేతగా నిలిచింది. మళ్లీ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని ఆ జట్టు భావిస్తుండగా.. లెక్క సరిచేయాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది.

వర్షం రావడం 95 శాతం..
అయితే ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. రిజర్వ్ డే రోజునా వర్షం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెల్బోర్న్లో లానినా ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. మెల్బోర్న్లో ఆదివారం, సోమవారం వర్షం పడే అవకాశాలు 95 శాతం ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం పడే అవకాశముంది. ఆ రోజు 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వొచ్చని అంచనా. ఇక దురదృష్టవశాత్తూ సోమవారం కూడా 5 నుంచి 10 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు కావొచ్చు' అని మెల్బోర్న్ మెటరాలజీ బ్యూరో వెల్లడించింది.

మ్యాచ్ రద్దయితే...
టోర్నమెంట్ నిబంధనల ప్రకారం.. సాధ్యమైనంత వరకు తక్కువ ఓవర్లకు కుదించైనా మ్యాచ్ను నిర్వహించడమే ప్రథమ ప్రాధాన్యం. అయితే, నాకౌట్ దశలో కనీసం 10 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం మ్యాచ్ మొదలై వర్షం కారణంగా ఆగిపోతే.. రిజర్వ్డే రోజున మిగతా ఆటను కొనసాగిస్తారు. రిజర్వే డే రోజునా మ్యాచ్ను కొనసాగించే పరిస్థితి లేనప్పుడు.. ఇరు జట్లు టైటిల్ను పంచుకుంటాయి.

గతంలోనూ..
వన్డే ప్రపంచకప్- 2019 సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో.. భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రెండు రోజులు జరిగింది. ఇక 2002లో భారత్, శ్రీలంక మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ ఇలాగే జరిగింది. మ్యాచ్ మొదలుపెట్టాక వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నిబంధనల ప్రకారం.. రిజర్వ్ డే రోజున మళ్లీ మొదటి నుంచి మ్యాచ్ ప్రారంభించారు. అప్పటికీ వర్షం అడ్డంకిగా మారడంతో ఇరు జట్లు టైటిల్ను షేర్ చేసుకున్నాయి.

మూడు మ్యాచ్లను మింగేసిన వర్సం..
ప్రస్తుత మెగా టోర్నీలో గ్రూప్ దశలో మెల్బోర్న్ మైదానంలో మూడు మ్యాచ్లు బంతి పడకుండానే రద్దయ్యాయి. వర్షం కారణంగా మరో మ్యాచ్ను కుదించారు. టైటిల్ షేర్ చేసుకుంటే అభిమానులకు అసలు సిసలు మజా దూరం కానుంది. అప్పుడు టోర్నీ అట్టర్ ఫ్లాఫ్ జాబితాలోకి చేరుతుంది. భారత్-పాక్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ సెమీస్లోనే భారత్ వెనుదిరడగంతో అభిమానులు బిగ్ గేమ్ను మిస్సయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications