T20 World Cup 2022: శ్రీలంకను చూసి టీమిండియా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే!

హైదరాబాద్: ఓ వైపు దేశంలో అర్థిక, రాజకీయ సంక్షోభం.. ఆతిథ్య హక్కులు తమవే అయినా ఆసియాకప్ను సొంతగడ్డపై నిర్వహించలేని పరిస్థితి. ఇంకోవైపు ఐదారేళ్లుగా ఆటలో అట్టడుగుస్థాయికి పడిపోతున్న వైనం. పైగా ఆరంభ మ్యాచ్లోనే చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో అవమానం. ఇలా మైదానం లోపల, బయట గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న శ్రీలంక ఆసియా కప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ లంక మాత్రం అసాధారణ ప్రదర్శనతో అద్భుతం చేసింది.
ప్రతీ ఆటగాడు ఓ సైనికుడిలా.. ప్రాణం పెట్టి ఆడటంతో ఆరోసారి ఆసియా కప్ను ముద్దాడిన శ్రీలంక.. దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దాంతో పాటు పతనావస్థలోకి వెళ్తున్న తమ క్రికెట్కు కొత్త ఊపిరి అందించింది. మరోవైపు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా మాత్రం ఊహించని విధంగా బొక్క బోర్లా పడింది. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంక అసాధారణ విజయం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.

సమష్టిగా రాణించడం..
శ్రీలంక టైటిల్ గెలవడానికి అత్యంత కీలకమైన అంశం సమష్టిగా రాణించడంతో పాటు సరైన తుది జట్టుతో బరిలోకి దిగడం. టోర్నీలో జరిగిన ఆరు మ్యాచ్ల్లో లంక కేవలం మూడు మార్పులు మాత్రమే చేసింది. కానీ భారత్ మాత్రం ప్రతీ మ్యాచ్లో మార్పులతో బరిలోకి దిగింది. టీ20 ప్రపంచకప్ గురించి ఆలోచిస్తూ రోహిత్, ద్రవిడ్ ఆడుతున్న టోర్నీలో చేతులు కాల్చుకున్నారు.
ముఖ్యంగా పంత్, కార్తీక్, అశ్విన్, బిష్ణోయ్ల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో తేల్చుకోలేకపోయారు. దాంతో టీమిండియా తుది జట్టు సెటిల్డ్గా కనిపించలేదు. జడేజా గాయం జట్టుకు మరింత నష్టం చేసింది. దీపక్ హుడా బరిలోకి దిగినా అతను దారుణంగా విఫలమయ్యాడు. ఏ ఫార్మాట్లో అయినా తుది జట్టును అదే పనిగా మార్చడం వల్ల నష్టమే తప్పా లాభం ఉండదనే విషయం బోధపడింది. టీ20 ప్రపంచకప్లోనైనా ఫస్ట్ ఫైనల్ ఎలెవన్తో బరిలోకి దిగాలి.

చమిక కరుణరత్నే..
శ్రీలంక ఆరంభం నుంచి స్పిన్నర్లు హసరంగ(9 వికెట్లు), తీక్షణ(6 వికెట్లు)ను తమ ప్రధాన బౌలర్లుగా ప్రయోగించింది. వాళ్లకు మద్దతుగా పేసర్లు చమిక కరుణరత్నే, మదుషంక కలిసి 13 వికెట్లు పడగొట్టారు. భారత్ ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగింది. కానీ ఆవేశ్ తీవ్రంగా నిరాశపరచడంతో ఆల్రౌండర్ హార్దిక్తో ఫుల్ కోటా వేయించాల్సి వచ్చింది. కానీ ప్రధాన పేసర్ లోటును పాండ్యా భర్తీ చేయలేకపోయాడు.
ఈ టోర్నీ తను 4 వికట్లు తీస్తే.. పాక్తో తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. జడేజా గాయంతో వైదొలగడంతో కాంబినేషన్ విషయంలోనూ సమస్యలు వచ్చాయి. అశ్విన్, చాహల్ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీసింది. బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగిరావడంతో వరల్డ్ కప్ బరిలోకి దిగే టీమిండియా బౌలింగ్ బలం పెరిగింది. ఈ ఇద్దరికి అండగా భువీ,మరో ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటే టీమిండియాకు తిరుగుండదు.

పవర్ హిట్టింగ్ లేకపోవడం..
లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ దాదాపు అన్ని మ్యాచ్ల్లో జట్టుకు బలమైన పూనాది వేశారు. తర్వాత డెత్ ఓవర్లలో భానుక రాజపక్స, డసన్ షనక, హసరంగా పవర్ హిట్టింగ్తో మంచి స్కోర్లు చేయడంతో పాటు పెద్ద లక్ష్యాలని లంక చేధించ గలిగింది. కానీ టీమిండియాలోఇదే లోపించింది. రోహిత్ 4 ఇన్నింగ్స్ల్లో 133 రన్స్ మాత్రమే చేయగా.. కేఎల్ రాహుల్ 133 రన్స్ మాత్రమే చేశాడు.
హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా 3 ఇన్నింగ్స్ల్లో 50 రన్సే చేశాడు. దినేశ్ కార్తీక్కు బ్యాటింగే రాలేదు విరాట్ కోహ్లీ మినహా భారత బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. పించ్ హిట్టింగ్ అనేది టీమిండియాకు చాన్నాళ్ల నుంచి సమస్యగా ఉంది. టీ20 ఫార్మాట్లో పరిస్థితులు వేగంగా మారుతాయి కాబట్టి భారత బ్యాటర్లు వేగంగా ఆడాల్సి ఉంది. బ్యాటింగ్ తమ అప్రోచ్ మార్చుకొని హిట్టింగ్ చేయకపోతే ఆస్ట్రేలియాలోనూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications