న్యూఢిల్లీ: యావత్ క్రికెట్ ప్రపంచం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ గురించే మాట్లాడుతోంది. నాలుగు రోజుల క్రితమే ఈ మెగా టోర్నీకి తెరలేవగా.. శనివారం(అక్టోబర్ 22) నుంచి అసలు సిసలు సూపర్ 12 ప్రారంభం కానుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్తో ఈ మెగా సమరం షురూ కానుంది. అయితే గత వారం రోజులుగా క్రికెట్ ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు, అభిమానులు అంతా ఈ మెగా టోర్నీ గురించే చర్చిస్తున్నారు. టైటిల్ గెలిచే జట్టు ఏదో అంచనా వేస్తున్నారు. సెమీఫైనల్ చేరే జట్లు, హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతున్న జట్లు ఏవో జోస్యం చెబుతున్నారు. అయితే ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా ప్రెడిక్ట్ చేస్తున్నారు.
Cricbuzz experts predicts Top runs scorer in this T20 World Cup 2022:
— CricketMAN2 (@ImTanujSingh) October 20, 2022
•Zaheer Khan - Suryakumar.
•Parthiv Patel - Suryakumar.
•Harsha Bhogle - Suryakumar.
•Simon Doull - Jos Buttler.
•Ashish Nehra - Jos Buttler
•Virender Sehwag - Babar Azam.
•Michael Vaughan - Babar Azam.
దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేలు టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందనే ఆశల్లేవని చెబుతుంటే.. షేన్ వాట్సన్, రికీ పాంటింగ్ వంటి ఆసీస్ మాజీ ఆటగాళ్లు మాత్రం టైటిల్ గెలిచే సత్తా భారత్కు ఉందంటున్నారు. చాలా మంది మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. విజేత విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా మిగిలిదే భారత బ్యాటరేనని ముక్త కంఠంతో వెల్లడిస్తున్నారు. అతనేవరో కాదు.. గత కొన్ని రోజులుగా టీ20 ఫార్మాట్ను తనదైన బ్యాటింగ్తో శాసిస్తున్న సూర్యకుమార్ యాదవ్. టాప్ ర్యాంకింగ్లో కొనసాగుతున్న సూర్యకుమారే.. ఈ మెగా టోర్నీని శాసిస్తాడని జోస్యం చెబుతున్నారు.
వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఊసే ఎత్తని మాజీలు.. సూర్యకుమార్ పేరే చెబుతుండటం గమనార్హం. తాజాగా క్రిక్బజ్ ఎక్స్పర్ట్స్ సైతం సూర్యనే టాపర్ ఆఫ్ ది బ్యాటర్ అంటూ జోస్యం చెప్పారు. ఈ ఎక్స్పర్ట్స్లో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్తో పాటు హర్షా భోగ్లే సూర్యకుమారే టాప్ స్కోరరని చెప్పారు. ఆశిష్ నెహ్రా, సైమన్ డౌల్ మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు చెప్పారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేరు చెప్పారు.
ఇక టీమిండియా ఆదివారం(అక్టోబర్ 23) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే తొలి మ్యాచ్తో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఇక గాయంతో జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి రాగా.. అతనే జట్టు బౌలింగ్ బాధ్యతలను మోయనున్నాడు.