|
2015లో రోహిత్ను కూడా...
ఇక ఈ ఆరోపణలను భారత అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు తిప్పికొడుతున్నారు. విరాట్ సరదాగా చేసిన పనని, అందులో ఎలాంటి ఫేక్ ఫీల్డింగ్ లేదని, ఓటమికి సాకులు వెతుక్కోవడం ఇకనైన ఆపాలని ప్రముఖ కామెంటేటర్ హర్షాభోగ్లే ట్వీట్ చేయగా.. ఇలాంటి సాకులు చెప్పడం బంగ్లాదేశ్కు అలవాటేనని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ స్పష్టం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్లోనూ రోహిత్ శర్మ ఔట్ విషయంలోనూ బంగ్లాదేశ్ ఇలానే రచ్చ చేసిందని గుర్తు చేశాడు. నోబాల్కు రోహిత్ ఔటవ్వగా.. అంపైర్ల నిర్ణయాన్ని బంగ్లాదేశ్ తప్పుబట్టిందన్నాడు.
|
కోహ్లీ ఏ తప్పు చేయలేదు..
ఆ దేశ ప్రధానితో పాటు అప్పుడు ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న బంగ్లాదేశ్ వ్యక్తి ముస్తఫా కమల్ కూడా అంపైర్లదే తప్పని రచ్చ చేశాడని బొరియా మజుందార్ చెప్పుకొచ్చాడు. విరాట్ ఎలాంటి ఫేక్ ఫీల్డింగ్కు పాల్పడలేదని, ఫేక్ ఫీల్డింగ్తో బ్యాటర్ దృష్టి మారిస్తేనే రూల్ 41.5 ప్రకారం ఐదు పరుగుల పెనాల్టీ వేయవచ్చని చెప్పాడు. కానీ బ్యాటర్లు విరాట్ ఫేక్ ఫీల్డింగ్పై అంపైర్లకు ఫిర్యాదు చేయలేదని, అసలు వారు అతన్ని చూడనే లేదనే విషయం రిప్లేలో స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్కు ఇలా ఓటములకు సాకులు వెతుక్కోవడం అలవాటేనని చెప్పుకొచ్చాడు.
|
సాకులు వెతకడం మానేయండి..
ఇక ఫేక్ ఫీల్డింగ్ ఆరోపణలపై ట్విటర్ వేదికగా స్పందించిన హర్షాభోగ్లే.. ఓటమికి సాకులు వెతకడం మానేయాలని సూచించాడు. 'బంగ్లాదేశ్ మిత్రులారా.. దయచేసి మీ జట్టు ఓటమికి ఫేక్ ఫీల్డింగ్, చిత్తడి మైదానమని చెప్పకండి. ఒక్క బ్యాటర్ క్రీజులో నిల్చున్నా బంగ్లాదేశ్ విజయం సాధించేది. దీనిని అంగీకరించకుండా సాకులు వెతుకడం ప్రారంభిస్తే మనం ఎప్పటికీ ఎదగలేం. మైదానం చిత్తడిగా ఉందని ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్లు నాకు అనిపించలేదు. షకీబ్ ఇది బ్యాటర్లకే అనుకూలమవుతుందని చెప్పాడు.
|
ఆ ఘటనను ఎవరూ చూడలేదు..
అంపైర్లు, పిచ్ క్యూరేటర్ పలుమార్లు పరిశీలించి కెప్టెన్లతో మాట్లాడి ఆట కొనసాగించడంపై నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫేక్ ఫీల్డింగ్ ఘటనను ఎవరూ చూడలేదు. అంపైర్లతో పాటు బ్యాటర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు. 41.5 నిబంధన అనేది ఫేక్ ఫీల్డింగ్ బ్యాటర్లను అయోమయానికి గురిచేసినప్పుడే ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ బ్యాటర్లు గందరగోళానికి గురైనట్లు అంపైర్లకు చెప్పలేదు. అంపైర్లు కూడా ఈ ఘటనను చూడలేదు'అని హర్షాభోగ్లే వరుస ట్వీట్లలో రాసుకొచ్చాడు.