ఎవడూ ఫేవరేట్ కాదు..
నాసర్ హుస్సేన్ మాత్రం భిన్నంగా స్పందించాడు.'టీ20 గేమ్లో ఎవరినీ ఫేవరేట్గా పరిగణించలేం. వ్యక్తిగత ప్రదర్శనే కీలకమవుతుంది. మూడే మూడు బంతులతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోవచ్చు. అందుకే నాకౌట్లో ఎవరినీ తక్కువ అంచనా వేయలేం. అదే క్రమంలో ఏ జట్టైనా టీమిండియాను చిత్తు చేయవచ్చు" అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ టాప్-ఆర్డర్ బ్యాటర్లు విఫలమైతే భారత్ జట్టు వద్ద ప్లాన్-బి లేదని.. అదే ఆ జట్టు కొంపముంచవచ్చన్నాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఈ సమస్యతోనే టైటిల్ చేజార్చుకుందని చెప్పాడు.
టాపార్డర్ విఫలమైతే..
'గత వన్డే ప్రపంచకప్ను ఓసారి పరిశీలిస్తే.. చివరి వరకు న్యూజిలాండ్ అద్భుతంగా ఉంది. ప్లాన్-బి లేకపోవడం వల్ల తక్కువ స్కోరింగ్ మ్యాచ్లోనూ తడబాటుకు గురైంది. అదే బాటలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న టీమిండియాకు కూడా ప్లాన్-బి లేదు. నాకౌట్లో ప్రతి జట్టు సాయశక్తులా విజయం కోసం ఆడతాయి. ప్రతి ఒక్కరూ తామే గెలుస్తాం అని అనుకుంటూ ఉంటారు. అభిమానులు కూడా పేపర్ మీద టీం లైనప్ను చూసి తమ జట్టే గెలుస్తుందని అనుకోవడం సహజమే. టీమిండియా టాప్-ఆర్డర్ సరిగా ఆడనప్పుడు మిగతా టీం సభ్యులు ఎలా ఆడతారో వేచి చూడాలి' అని నాసర్ హుస్సేన్ విశ్లేషించాడు. టీ20 ప్రపంచకప్ వేటను భారత్ అక్టోబర్ 24న పాకిస్థాన్తో పోరుతో ప్రారంభిస్తుంది.
కోహ్లీసేనే హాట్ ఫేవరేట్..
బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్పను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్గా టీమ్ను వెనకుండి నడిపించబోతున్నాడు. ఇటీవలె ముగిసిన ఐపీఎల్తో ఆటగాళ్లంతా మంచి టచ్లో కనిపిస్తున్నారు. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న భారత్.. రోహిత్, విరాట్, రాహుల్, పంత్, బుమ్రాలాంటి మ్యాచ్ విన్నర్లతో ఊపు మీద కనిపిస్తోంది. 2016 మెగా టోర్నీ తర్వాత భారత్ ఈ ఫార్మాట్లో 72 మ్యాచ్లాడింది. 65.3 విజయాల శాతంతో 47 గెలుపులు, 22 ఓటములతో మెరుగ్గానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచక్పలోనూ ఆడిన 33 మ్యాచ్ల్లో 21 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది. అదీగాకుండా కోహ్లీ ఆధ్వర్యంలో భారత జట్టు చివరి టీ20 టోర్నీ ఆడబోతోంది. ధోనీ సైతం మరో టైటిల్ అందించాలనే ఆశతో ఉన్నాడు. ఈ కప్ను ఈ ఇద్దరికి కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో సహచర ఆటగాళ్లున్నారు.