దుబాయ్: అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో టైటిలే లక్ష్యంగా టీమిండియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తున్నాయి. 8 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించేందుకు పకడ్బందీ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా మెంటార్గా నియమించిన బీసీసీఐ.. మెగా టోర్నీకి ముందు రెండు వార్మప్ మ్యాచ్లను కూడా ఏర్పాటు చేసింది.
అక్టోబర్ 24న దాయదీ పాకిస్థాన్తో జరిగే తొలి పోరుతో టీ20 ప్రపంచకప్ టైటిల్ వేటను ప్రారంభించనున్న కోహ్లీసేన అంతకు ముందే రెండు సన్నాహక మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 18వ తేదీన ఇంగ్లండ్తో, 20వ తేదీన ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్లకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మెగా టోర్నీ బరిలోకి దిగే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ జట్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కింది. గత నాలుగేళ్లుగా టెస్ట్లకే పరిమితమైన అశ్విన్.. వాషింగ్టన్ సుందర్ గాయపడటం, ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబర్చడంతో చోటు దక్కించుకున్నాడు. పైగా యూఏఈ పిచ్లు స్పిన్ అనుకూలం కావడం కూడా అతనికి కలిసొచ్చింది.
టీమ్ సెలెక్షన్ సందర్భంగా చేతన్ శర్మ మాట్లాడుతూ..అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమన్నాడు. ''అశ్విన్ జట్టుకు ఆస్తి. ఐపీఎల్లో రాణించాడు. జట్టుకు అతడిలాంటి అనుభవజ్ఞుడు అవసరం. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో మాకు ఆఫ్స్పిన్నర్ అవసరమయ్యాడు. జట్టులో అశ్విన్ ఒక్కడే ఆఫ్స్పిన్నర్'' అని అన్నాడు. హార్దిక్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పాడు. బౌలింగ్లో వేగం ఉండడం వల్లే చాహల్ను కాదని రాహుల్ చాహర్ను ఎంచుకున్నామని చేతన్ శర్మ తెలిపాడు. జడేజాకు బ్యాకప్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్, శార్దూల్, దీపక్ చాహర్ స్టాండ్బైలుగా ఎంపికయ్యారు.
బీసీసీఐ ఆధ్వర్యంలోనే యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ముందుగా ఒమన్ వేదికగా క్వాలిఫయర్స్ మ్యాచ్లు జరగనుండగా.. ఆ తర్వాత ప్రధాన లీగ్ మ్యాచ్లు(సూపర్ 12) యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. గ్రూప్ 1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్ లు ఉండగా.. గ్రూప్ 2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్తో పాటు క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బీ విజేత ఉన్నాయి. మెగా టోర్నీ ఫైనల్ నవంబర్ 14 దుబాయ్ వేదికగా జరగనుంది.