టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో త్వరలో సందడి మొదలుకానుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న సూర్య.. తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించారు. సూర్యకుమార్ యాదవ్ దేవిషా శెట్టి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
వెలుగులోకి సీమంతం వీడియో
గత కొన్ని రోజులుగా దేవిషా శెట్టి గర్భవతి అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై అటు సూర్యకుమార్ యాదవ్ కానీ.. ఇటు దేవిషా కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. తాజాగా దేవిషా సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ఈ వార్త నిజమని తేలిపోయింది. ఈ వీడియోలో సూర్య, దేవిషా ఇద్దరు చిరునవ్వులు చిందిస్తూ వేడుక జరిగే హాల్లోకి రావడం కనిపిస్తుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బిజీ షెడ్యూల్లోనూ భార్య కోసం..
టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి సూర్యకుమార్ యాదవ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రపంచకప్ ట్రోఫీతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ సిద్ధ వినాయక ఆలయాన్ని సందర్శించారు. సూర్యతో పాటు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఓ బిజినెస్ అవార్డుల కార్యక్రమంలో కూడా సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. తన వ్యక్తిగత జీవితంలో ఈ మధుర క్షణాలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు.
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించిన మూడో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. 2026 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ మూడోసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ముద్దాడింది. కెరీర్ పరంగా శిఖరాగ్రంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు తండ్రిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతుండటం విశేషం.