టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన హైడ్రామాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఛైర్మన్ జై షా ఎట్టకేలకు నోరు విప్పారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్.. అలాగే భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్థాన్లకు ఆయన పరోక్షంగా చురకలంటించారు. ఏ జట్టూ సంస్థ కంటే పెద్దది కాదని జైషా స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?
ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్లో పర్యటించడానికి భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా వారు వెనక్కి తగ్గకపోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంఘీభావంగా పాకిస్థాన్ కూడా తొలుత భారత్తో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించి ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది.

జై షా కీలక కామెంట్స్
ముంబైలో జరిగిన 'ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్' కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ ఈ వివాదాలపై స్పందించారు. "ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కొన్ని జట్ల భాగస్వామ్యంపై చాలా చర్చలు జరిగాయి. కానీ ఐసీసీ ఛైర్మన్గా నేను ఒకటే చెబుతున్నాను.. ఏ ఒక్క జట్టూ సంస్థ కంటే పెద్దది కాదు. ఏ ఒక్క జట్టూ సంస్థను తయారు చేయదు. అన్ని జట్ల కలయికే ఒక సంస్థ" అని జై షా కుండబద్ధలు కొట్టారు. నేరుగా పేర్లు ఎత్తకపోయినా.. ఆయన కామెంట్స్ పాకిస్థాన్, బంగ్లాదేశ్లను ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది.
రికార్డులు తిరగరాసిన ప్రపంచకప్
వివాదాలు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచకప్ వ్యూవర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించిందని జై షా కొనియాడారు. ఈ టోర్నీలో ఏకకాలంలో 7.2 మిలియన్ల మంది వీక్షించి రికార్డు సృష్టించారు. పసికూనలు అద్భుత ప్రదర్శన చేశారని.. నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చాయని ఆయన అభినందించారు.
టీమిండియాకు జై షా సందేశం
విజేతగా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లకు జై షా ఓ కీలక సందేశం ఇచ్చారు. "శిఖరం నుంచి కిందకు పడిపోవడానికి కొనని నెలలు చాలు, కానీ అట్టడుగు నుంచి పైకి రావడానికి ఏళ్లు పడుతుంది. కష్టపడి ఆడండి, భవిష్యత్తులో రాబోయే 2030, 2031, 2036 టోర్నీల కోసం ఇప్పటి నుంచే సిద్ధ కావాలి" అని జై షా దిశానిర్ధేశం చేశారు.