పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీనియర్ సెలెక్టర్, మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భారత క్రికెట్ జట్టుకు కీలక ఆయుధంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను, పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్తో పోల్చడం ద్వారా ఆయన అనవసర వివాదానికి తెరలేపారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఉస్మాన్ తారిఖ్ ఆటతీరుపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఆకిబ్ జావేద్ ఈ వింత పోలికను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఆకిబ్ జావేద్ వాదన ఏమిటి?
టీ20 వరల్డ్ కప్లో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ ప్రభావం చూపలేకపోయారనే విమర్శలపై ఆకిబ్ జావేద్ స్పందిస్తూ.. "ఈ టోర్నీని పరిశీలిస్తే బుమ్రా బౌలింగ్లో కూడా బ్యాటర్లు పరుగులు సాధిస్తున్నారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ సాధారణంగా ఉండదు. అది భిన్నంగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు అతని ఫామ్ను త్వరగా అర్థం చేసుకోలేరు. సరిగ్గా ఉస్మాన్ తారిఖ్ కూడా భిన్నమైన యాక్షన్తో బౌలింగ్ చేస్తాడు. అందుకే నేను జస్ప్రీత్ బుమ్రాను 'ఫాస్ట్ బౌలింగ్ ఉస్మాన్ తారిఖ్ అని పిలుస్తాను" అని వివరణ ఇచ్చారు. అయితే బౌలింగ్ యాక్షన్ విషయంలో ఉన్న పోలికను, ఆటగాళ్ల స్థాయిని పోల్చడం చాలా అసంబద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.

గణాంకాలతో తిప్పికొడుతున్న నెటిజన్లు
ఆకిబ్ జావేద్ కామెంట్లను నెటిజన్లు గణాంకాలతో బలంగా తిప్పికొడుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే ఓ లెజెండ్ అని.. 95 టీ20 మ్యాచ్లలో 121 వికెట్లు తీసి తన సత్తా నిరూపించుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ 2026లో అత్యంత ఒత్తిడి ఉండే సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో బుమ్రా వేసిన అద్భుతమైన స్పెల్స్ భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాయి. మరోవైపు ఉస్మాన్ తారిఖ్ ఇంకా తన అంతర్జాతీయ కెరీర్లో ఎదుగుతున్న ఆటగాడు మాత్రమే. కేవలం 9 మ్యాచ్లలో 18 వికెట్లు తీసినప్పటికీ.. ప్రధాన టోర్నీలలో ఉస్మాన్ తారిఖ్ 'మిస్టరీ' బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
ఓ ప్రపంచ స్థాయి బౌలర్ను కెరీర్ ఆరంభంలో ఉన్న యువ ఆటగాడితో పోల్చడం పట్ల క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆకిబ్ జావేద్ కామెంట్స్ తన ఆటగాడిని సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప.. ఇందులో ఎలాంటి సహేతుకత లేదని వారు మండిపడుతున్నారు. బుమ్రా పరుగులను ఆపడమే కాకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ ఫలితాలను మార్చే సత్తా ఉన్నవాడని.. కానీ ఉస్మాన్ తారిఖ్ ఆ స్థాయికి ఇంకా చాలా దూరంలో ఉన్నాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి పాకిస్తాన్ క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న ఇటువంటి కామెంట్స్ తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. ఆటగాళ్ల మధ్య సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయకుండా చేసే పోలికలు ఆ ఆటగాళ్లకే కాకుండా.. సెలెక్టర్ల గౌరవాన్ని కూడా తగ్గిస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఆకిబ్ జావేద్ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.