IPL 2026: మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో పాటు.. 14 ఏళ్లకే సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఉంది. ఐపీఎల్కు కౌంట్డౌన్ మొదలైన వేళ టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే కూడా సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సారి ఐపీఎల్ సీజన్లో 'గేమ్ ఛేంజర్' అవుతారని జోస్యం చెప్పారు.
ఇప్పుడు సాకులు లేవు: ఆకాష్ చోప్రా
అభిషేక్ శర్మ టాలెంటెడ్ ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ ఐపీఎల్లో అతనికి ఇంకా ఓ పరిపూర్ణమైన 'బ్రేక్ అవుట్' సీజన్ (500+ పరుగులు చేసే సీజన్) రాలేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు. "అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురేల్ వంటి ఆటగాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. అంతేకాదు వారు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు కూడా. కాబట్టి వారిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఈ సీజన్ అభిషేక్ శర్మకు టర్నింగ్ పాయింట్ కావాలి. ఇకపై ఫామ్ గురించి సాకులు చెప్పడానికి వీల్లేదు" అని ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.

2024లో మెరుపులు.. 2026లో ఏం జరుగుతుంది?
2024 సీజన్లో అభిషేక్ శర్మ 484 పరుగులతో సన్రైజర్స్ను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత స్థిరత్వం కోల్పోయాడనే విమర్శలు వచ్చాయి. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లోనూ అభిషేక్ ప్రయాణం ఎత్తుపల్లాల మధ్య సాగింది. 8 ఇన్నింగ్స్ల్లో 141 పరుగులే చేసినప్పటికీ.. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో హాఫ్ సెంచరీ బాది తాను 'బిగ్ మ్యాచ్ ప్లేయర్' అని నిరూపించుకున్నాడు.
శుభ్మన్ గిల్, జైస్వాల్తో పోటీ పడగలడా?
శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ప్రతి ఏటా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటున్నారు. అభిషేక్ శర్మ కూడా ఆ స్థాయికి చేరాలంటే ఈ సీజన్లో కనీసం 500 నుంచి 600 పరుగులు చేయాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో జరిగే తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ తన ప్రతాపాన్ని చూపాల్సి ఉంది.