IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో జట్లు పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఒకటి. అయితే సీఎస్కే జట్టుకు ఓ వింత సెంటిమెంట్ ఉంది. ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడి మీదైనా సీఎస్కే భారీగా నిధులు కుమ్మరిస్తే.. ఆ ప్లేయర్ ఫాన్ లేకపోవడం వల్లనో లేదా తుది జట్టులో చోటు దక్కక విఫలమవ్వడం లాంటి తంతు గత పదేళ్లుగా కనిపిస్తోంది. తాజాగా ఐపీఎల్ 2026 వేలంలో అన్క్యాప్ట్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కోసం సీఎస్కే ఏకంగా రూ.28.40 కోట్లు(ఒక్కొక్కరికి రూ.14.20 కోట్లు) ఖర్చు చేసింది. మరి ఈ యువ ఆటగాళ్లైనా ఈ సీఎస్కే వింత సెంటిమెంట్ ను అధిగమిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
ఫ్లింటాఫ్ కాలం నుంచి మొదలైన సెంటిమెంట్
2009లో ఆండ్రూ ఫ్లింటాఫ్ను భారీ ధరకు కొనుగోలు చేసినప్పటి నుంచి సీఎస్కేకు ఖరీదైన ఆటగాళ్లు కలిసి రావడం లేదు. 2012లో రవీంద్ర జడేజాను 2 మిలియన్ డాలర్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేయగా.. ఆ సీజన్ బ్యాటింగ్ లో కేవలం 15 సగటుతో నిరాశపరిచాడు. 2013లో క్రిస్ మోరిస్ 6.25 లక్షల డాలర్లకు కొనుగోలు చేయగా.. 15 వికెట్లతో రాణించి సీఎస్కేను ఫైనల్ చేర్చాడు. ఇది సీఎస్కే చరిత్రలో ఓ అరుదైన విజయంగా నిలిచింది. 2015లో మైఖేల్ హస్సీ, ఇర్ఫాన్ పఠాన్ల కోసం రూ.1.5 కోట్ల చొప్పున ఖర్చు చేయగా.. ఇర్ఫాన్ పఠాన్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మైఖేల్ హస్సీ కేవలం 4 మ్యాచ్లకే పరిమితమయ్యాడు.

2018 తర్వాత గాయాల బెడద
రెండేళ్ల నిషేధం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన చెన్నైకి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లు చుక్కలు చూపించారు. 2018లో కేదార్ జాదవ్ రూ.7.8 కోట్లకు కొంటే తొలి మ్యాచ్లోనే గాయపడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 2021లో రూ. 9.25 కోట్లతో కృష్ణప్ప గౌతమ్ ఆ సమయంలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి రాలేదు. 2022లో దీపక్ చాహర్ పై రూ.14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే.. గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. 2023లో బెన్ స్టోక్స్ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేస్తే.. కేవలం 2 మ్యాచ్లు ఆడి.. 15 పరుగులు చేసి.. బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.
కొత్త ఆశలు.. కొత్త సవాళ్లు
2025లో నూర్ అహ్మద్ (రూ. 10 కోట్లు) 24 వికెట్లతో రాణించి ఈ నెగటివ్ ట్రెండ్ను కొంతవరకు బ్రేక్ చేశాడు. ఇప్పుడు 2026లో కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ వంటి యువకులపై చెన్నై భారీ పెట్టుబడి పెట్టింది. సీఎస్కే ఎప్పుడూ 'డాడ్స్ ఆర్మీ' (అనుభవం ఉన్నవారు)గా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి యువ రక్తంపై రూ. 28 కోట్లు పోయడం భవిష్యత్తు వ్యూహంలో భాగమే అయినా, పాత రికార్డులు పునరావృతం కాకూడదని మేనేజ్మెంట్ కోరుకుంటోంది.