భారత మాజీ వికెట్ కీపర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్ దినేష్ కార్తీక్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి, భారత స్క్వాష్ ప్లేయర్ దీపిక్ పల్లికల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేశ్ కార్తీక్-పల్లికల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తమ కుమార్తెకు రాహా పల్లికల్ కార్తీక్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.

'మా హృదయపూర్వక ఆశీస్సులతో.. మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతతో.. మా ముద్దుల పాపాయిని ఈ ప్రపంచంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కబీర్, జియాన్లకు తమ చిట్టి చెల్లెలు 'రాహా పల్లికల్ కార్తీక్'ను పరిచయం చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రేమతో మీ దీపికా-దినేశ్'అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.

మూడో సంతానానికి జన్మనిచ్చిన దీపిక, కార్తీక్లకు పలువురు సెలెబ్రిటీలు, మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, శిఖర్ ధావన్లు సైతం శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
2015 ఆగస్టు 18న దీపికా-దినేష్ కార్తీక్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. దినేశ్ కార్తీక్కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్యను తన స్నేహితుడు, క్రికెటర్ మురళీ విజయ్ పెళ్లి చేసుకోవడంతో.. డిప్రెషన్లోకి వెళ్లిన దినేష్ కార్తీక్కు పల్లికల్ పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. 2021లో వీరికి ఇద్దరు మగ కవలు పుట్టారు. వారి పేర్లు కబీర్, జియాన్గా నామకరణం చేశారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డీకే మూడోసారి తండ్రి అయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దీనేష్ కార్తీక్.. కామెంటేటర్గా.. కోచ్గా తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్ కూడా ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా.. మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. అతని పర్యవేక్షణలోనే ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచింది.
స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికల్.. చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. అంతకు ముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్ షిప్-2022లో రెండు స్వర్ణ పతకాలు గెలిచింది. భారత ప్రభుత్వం పల్లికల్ను పద్మశ్రీతో సత్కరించింది.