టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచిన నేపథ్యంలో యువ సెన్సేషన్ అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టోర్నమెంట్ ఆరంభంలో వరుస డకౌట్లతో విమర్శల పాలైన అభిషేక్.. ఫైనల్లో వీరవిహారం చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి చేసిన 'రాస్కెల్' అనే కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రపంచ కప్ ఆరంభంలో తడబాటు
వరల్డ్ కప్ గ్రూప్ దశ మ్యాచ్లలో అభిషేక్ శర్మ ఆటతీరు అత్యంత పేలవంగా సాగింది. మొదటి మూడు మ్యాచ్లలోనూ ఖాతా తెరవకుండానే వరుసగా మూడు సార్లు డకౌట్ అయ్యి ఫ్యాన్స్ను నిరాశపరిచాడు. సెమీఫైనల్ వరకు ఆడిన 7 మ్యాచ్లలో కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ.. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచి తుది జట్టులో అవకాశం కల్పించారు.

ఫైనల్ మ్యాచ్లో విశ్వరూపం
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో అభిషేక్ శర్మ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. కివీస్ బౌలర్లపై అభిషేక్ శర్మ విరుచుకుపడుతూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 255/5 అనే భారీ స్కోరు సాధించింది. అనంతరం కివీస్ను 159 పరుగులకే కట్టడి చేసి భారత్ ప్రపంచకప్ను ముద్దాడింది.
అభిషేక్ ఒక 'రాస్కెల్': బ్రాడ్ హడిన్
ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో బ్రాడ్ హడిన్ మాట్లాడుతూ అభిషేక్ శర్మను ఆసక్తికరంగా ప్రశంసించారు. "నేను అభిషేక్కు పెద్ద అభిమానిని. టోర్నీ మధ్యలో అతను వరుస డకౌట్లు కావడంతో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి 'రాస్కెల్స్' (రౌడీల్లాంటి వాళ్లు) పెద్ద మ్యాచ్లలో అగ్నిగుండంలోకి కూడా ధైర్యంగా నడిచివెళ్తారు. అభిషేక్ సరిగ్గా అదే చేశాడు. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి, ఫైనల్ మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు." అని బ్రాడ్ హడిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
న్యూజిలాండ్ జట్టుపై కూడా కామెంట్స్
కివీస్ జట్టు వరుసగా ఫైనల్స్ చేరుకోవడాన్ని అభినందించిన హడిన్.. చివరి నిమిషంలో వారు తడబడటాన్ని విమర్శించారు. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ వంటి ఆటగాళ్లతో న్యూజిలాండ్ బలంగా కనిపించినప్పటికీ, అంతిమంగా ఒక బలమైన 'క్లాస్' టీమ్ (భారత్) విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ మొత్తంలో 158.42 స్ట్రైక్ రేట్తో 141 పరుగులు సాధించి, టీమిండియా భవిష్యత్తు స్టార్గా తన ముద్ర వేసుకున్నాడు.