ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తమ సన్నాహకాలను మొదలుపెట్టింది. మిగతా ఫ్రాంచైజీల కన్నా ముందే తమ హోమ్ గ్రౌండ్ చెపాక్లో ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆటగాళ్లంతా అప్కమింగ్ సీజన్ కోసం కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. గంటల కొద్దీ బ్యాటింగ్, బౌలింగ్ సెషన్స్తో పాటు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతూ సన్నదమవుతున్నారు.
45 ఏళ్ల వయసులోనూ ధోనీ తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ ధోనీ కుంటుతూ నడుస్తున్న ఒక వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. నెట్సెషన్ పూర్తి చేసుకొని మైదానం వీడే క్రమంలో ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతూ కుంటుతూ కనిపించాడు. కాస్త కష్టంగానే మైదానం వీడాడు. ధోనీ గాయంపై ఇప్పటి వరకు సీఎస్కే ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయకపోయినా.. అతని ఫిట్నెస్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్ 2023 సీజన్ నుంచే ధోనీ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఎడమ మోకాలి గాయంతోనే ఐపీఎల్ 2023 సీజన్ ఆడిన ధోనీ.. సీజన్ ముగిసిన వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ డాక్టర్ దిన్షా పార్దివాలా ఈ శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ తర్వాత ధోనీ కోలుకుని ఐపీఎల్ 2024, 2025 సీజన్లలో ఆడాడు. అయితే మోకాలి సమస్య పూర్తిగా తగ్గలేదు. తాజాగా అతను కుంటుతూ ఉన్న వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అభిమానుల కోసం ఇంత రిస్క్ తీసుకోవాల్సి అవసరం లేదని, రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరంటే.. చెన్నై జట్టు, అభిమానులపై ఉన్న అపారమైన ప్రేమతోనే ధోనీ నొప్పిని భరిస్తూ ఆటలో కొనసాగుతున్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్కే ధోనీ( సీఎస్కే నిషేధం సమయంలో మినహా) ఆడాడు. తన మెరుపు వికెట్ కీపింగ్తో పాటు విధ్వంసకర బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్గా మైదానంలో అతను అమలు చేసే వ్యూహాలు, ఎత్తులకు మరెవరూ సాటిలేరు.అయితే ధోనీ ఈ సీజన్తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతున్న క్రమంలో కుంటుతున్న వీడియో వైరల్ కావడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.