జాతివివక్ష వ్యాఖ్యలు
2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్లో హర్భజన్ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్కు సచిన్ మద్దతుగా నిలవడంతో అతను ఈ శిక్షను రద్దు చేశారు.
రూ. 5.4 కోట్లకి కొనుగోలు
'మంకీ గేట్' వివాదం జరిగిన ఏడాదే.. అంటే 2008లోనే ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం అయింది. వేలంలో ఆండ్రూ సైమండ్స్ని రూ. 5.4 కోట్లకి అప్పటి మన హైదరాబాద్ జట్టు దక్కన్ ఛార్జర్స్ కొనుగోలు చేసింది. అయితే భజ్జీతో గొడవ కారణంగా తాను ఐపీఎల్లో ఆడనని సైమండ్స్ మొండికేశాడట. దాంతో అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ రంగంలోకి దిగి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లని ఐపీఎల్లో ఆడేలా ఒప్పించే బాధ్యతని నీల్ మాక్స్వెల్కు అప్పగించాడు. అప్పట్లో ఐపీఎల్కి పోటీగా ఇండియన్ క్రికెట్ లీగ్ కూడా ఉండటంతో.. సైమండ్స్ను ఒప్పించడానికి శ్రమించాల్సి వచ్చిందని నీల్ మాక్స్వెల్ తాజాగా తెలిపాడు.
ఐపీఎల్లో ఆడేందుకు నిరాకరించాడు
'ది టాప్ ఆర్డర్ పోడ్కాస్ట్'తో నీల్ మాక్స్వెల్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడేలా ఒప్పించాలని లలిత్ మోడీ నన్ను కోరారు. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసీఎల్ వైపు వెళ్లకూడదని సూచించారు. సైమండ్స్ విషయంలో అయితే చాలా సమయం నాతో చర్చించారు. హర్భజన్ సింగ్తో గొడవ కారణంగా అతను ఐపీఎల్లో ఆడేందుకు తొలుత నిరాకరించాడు. అయితే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం, ఆడాల్సిన రోజులు గురించి అతనితో వివరంగా చెప్పా' అని తెలిపాడు.
రెండు రోజులు చర్చలు
'సైమండ్స్, నా మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఆ తర్వాత అతను ఐపీఎల్లో ఆడేందుకు అంగీకారం తెలిపాడు. మిగతా ఆటగాళ్ల విషయం పక్కన పెడితే.. సైమండ్స్ను ఒప్పించడానికి శ్రమించాల్సి వచ్చింది. నా తల ప్రాణం తోకకు వచ్చింది' అని నీల్ మాక్స్వెల్ సరదాగా అన్నాడు. 2008 నుంచి 2010 వరకు సైమండ్స్ దక్కన్ ఛార్జర్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2011లో హర్భజన్ సింగ్తో కలిసి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
198 వన్డేల్లో 5,008 పరుగులు
1998లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన ఆండ్రూ సైమండ్స్.. 198 వన్డేలు ఆడాడు. వైట్బాల్ క్రికెట్లో అటు బ్యాట్తో, ఇటు బంతితో రాణించిన సైమండ్స్ తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 5,008 పరుగులు, 133 వికెట్లు సాధించాడు. ఇక 26 టెస్టు మ్యాచ్లు, 14 అంతర్జాతీయ టీ20లను సైమండ్స్ ఆడాడు. మరోవైపు హర్భజన్ సింగ్ భారత్ తరపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు.
క్లిష్ట పరిస్థితుల్లో నిస్వార్ధ సేవలు.. భారత విద్యార్థిని పొగిడిన వార్నర్!!