
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థిని ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెచ్చుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో అతను చేస్తున్న కృషికి వార్నర్ ధన్యవాదాలు చెప్పాడు. బెంగుళూరుకు చెందిన శ్రేయస్ శ్రేష్ఠ్.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (బీటెక్) చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం అక్కడ పార్ట్టైమ్ ఉద్యోగాలు పోయి అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
అయితే క్వీన్స్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న శ్రేయస్యూనివర్సిటీ సామాజిక సేవ బృందంలో చేరి.. అక్కడ కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భోజన సదుపాయాలు అందిస్తున్నాడు. అతని సేవలను గుర్తించిన వార్నర్ ఒక వీడియోలో అభినందించాడు. ది ఆస్ట్రేలియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ (ఆస్ట్రేడ్)లో వార్నర్ తన వీడియో పోస్ట్ చేసాడు. ఈ సందర్భంగా శ్రేయస్ శ్రేష్ఠ్ సేవలను కొనియాడాడు.
'నమస్తే. శ్రేయస్కు ధన్యవాదాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కరోనా వైరస్తో నెలకొన్న పరిస్థితుల్లో అతను చాలా మంచి పనిచేస్తున్నాడు. అవసరమైన వారికి భోజన సదుపాయం అందిస్తున్నాడు. అతని నిస్వార్థమైన సేవకు అభినందనలు చెబుతున్నా. శ్రేయస్ తల్లిదండ్రులతో పాటు భారత దేశం మొత్తం అతణ్ని చూసి గర్వపడుతోంది. ఈ మంచి పనిని ఇలాగే కొనసాగించు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా కలిసే ఉన్నాం' అని వార్నర్ వీడియోలో పేర్కొన్నాడు.
అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కూడా ఓ భారతీయ నర్సు విద్యార్థినిని ప్రశంసించాడు. కరోనా నేపథ్యంలోనే ఆమె కూడా అక్కడ సేవ చేస్తున్నారని గిల్లీ పేర్కొన్నాడు. వొల్లంగాంగ్ విశ్వవిద్యాలయంలో నర్సు కోర్సు అభ్యసిస్తున్న షారోన్ వర్జెసి ఆరోగ్య కార్యకర్తగా సేవలందిస్తున్నారని మెచ్చుకున్నాడు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన షారోన్.. వృద్ధాప్య సంరక్షణా గృహంలో సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో పనిచేయాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. షారోన్ తల్లి అన్సీ కూడా కువైట్లో నర్సుగా పనిచేస్తున్నారు.