సారీరా.. సుందర్
మ్యాచ్ అనంతరం ఈ రనౌట్పై ప్రశ్నించగా.. తనదే తప్పని సూర్య అంగీకరించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. 'నాలో విభిన్నమైన కోణాన్నిఈ మ్యాచ్లో చూశారు. నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు పరిస్థితులను అందిపుచ్చుకోవడం ముఖ్యమని భావించాను. వాషింగ్టన్ సుందర్ ఔటైన అనంతరం ఒకరు ఇన్నింగ్స్ ముగిసే వరకు క్రీజులో ఉండటం ముఖ్యమనిపించింది. సుందర్తో సమన్వయ లోపం, రనౌటవ్వడంలో నాదే తప్పు. నేనే పరుగు తీయాల్సింది కాదు. బంతిని చూసుకోకుండా లేని పరుగుకోసం ప్రయత్నించాను.
హార్దిక్ అలా చెప్పడంతో..
ఈ వికెట్ బ్యాటర్లకు సవాల్ విసిరింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇంత టర్న్ ఉంటుందని మేం ఊహించలేదు. కానీ పరిస్థితులను అందిపుచ్చుకొని బ్యాటింగ్ చేశాం. చివరి ఓవర్లో ఒక్క షాట్ ఆడితే చాలనుకున్నాం. ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని భావించాం. విన్నింగ్ షాట్ ఆడే ముందు ఈ బంతికే మ్యాచ్ను ముగించేసేయ్ అని హార్దిక్ చెప్పాడు. అది నా ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచింది.'అని సూర్య తెలిపాడు. తనకే సాధ్యమైన వినూత్న షాట్లతో చెలరేగే సూర్య.. ఈ మ్యాచ్లో మాత్రం ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు. అది కూడా విన్నింగ్ షాట్.
చెలరేగిన భారత స్పిన్నర్లు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్(19 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
ఒక్క సిక్స్ లేదు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 101 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో ఫోర్తో 15 నాటౌట్) కడవరకు నిలిచి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, ఇష్ సోదీ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్1-1తో సమం చేసింది. ఆఖరి మ్యాచ్ బుధవారం(ఫిబ్రవరి) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.