కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరగుతున్న మూడో వన్డేలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. రివ్యూ కోసం నిమిషాల కొద్ది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం బహుషా ఇదే తొలిసారి కావచ్చు. అసలేం జరిగిందంటే.. లంక బౌలర్ ప్రవీణ్ జయవిక్రమార్క వేసిన ఇన్నింగ్స్ 23 ఓవర్ తొలి బంతిని టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ను మిస్సై ప్యాడ్లను తాకింది. దాంతో లంక ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సూర్య రివ్యూకు వెళ్లాడు.
ఇక థర్డ్ అంపైర్ ముందుగా బంతి బ్యాట్కు తగిలిందా? లేదా? అనేదాన్ని అల్ట్రా ఎడ్జ్ సాంకేతికత ద్వారా పరిశీలించాడు. స్నీకో మీటర్లో ఫ్లాట్ లైన్ రావడంతో బంతి బ్యాట్కు తగలలేదనే నిర్ణయానికి వచ్చాడు. అయితే థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ చూపించమని కోరగా.. టీవీ క్రూ చాలా సమయం తీసుకున్నారు. ఎంతకు చూపించకపోవడంతో ఓ దశలో అంపైర్లు అసహనానికి గురయ్యారు. చివరకు బాల్ ట్రాకింగ్లో బంతి నేరుగా వికెట్లను తగలడంతో లంక ప్లేయర్లు సంబరాలు చేసుకోగా.. సూర్యకుమార్ మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు.
మరోవైపు హార్దిక్ పాండ్యా క్రీజులోకి రావడానికి బౌండరీ లైన్ వద్ద వరకు వచ్చాడు. కానీ అక్కడే థర్డ్ అంపైర్ ట్విస్ట్ ఇచ్చాడు. బంతి ఔట్సైడ్ ఆఫ్ పిచ్ అయిందని, ఫీల్డ్ అంపైర్ను నిర్ణయం మార్చుకోవాలని చెప్పాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ వెంటనే సూర్యను వెనక్కుపిలిచాడు. దీంతో లంక ప్లేయర్లంతా అవాక్కవ్వగా.. భారత ఆటగాళ్లు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఓవర్ పూర్తవ్వగానే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు.
అంతకుముందు టీమిండియా కీలక వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ పృథ్వీ షా (49 బంతుల్లో 8 ఫోర్లతో 49), అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 46) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. ఈ ఇద్దరు రెండో వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ముందుగా డసన్ షనక వేసిన 16 ఓవర్లో పృథ్వీ షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత సంజూ శాంసన్ ఎక్స్ట్రా కవర్స్ దిశగా బౌండరీ ఆడబోయి ఫీల్డర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 118 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే, సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో సూర్య ఓ గండం తప్పించుకున్నాడు. వర్షంతో ఆగిపోయే సమయానికి భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లకు 147 రన్స్ చేసింది. క్రీజులో సూర్య(22 బ్యాటింగ్), మనీశ్ పాండే (10 బ్యాటింగ్) ఉన్నారు.