IPL 2021 in UAE: సురేశ్ రైనాకు బాల్కానీ రూమ్ బుక్ చేయడం మరిచిపోవద్దు.. నెటిజన్ల సెటైర్స్!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సీజన్లోని మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్-అక్టోబర్లో యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నేతృత్వంలో వర్చువల్ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. సెప్టెంబర్-అక్టోబర్లో భారత్లో వర్షాలు కురుస్తాయని, యూఏఈనే సరైన వేదికని పేర్కొంది.
ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పటికే 29 మ్యాచ్లు పూర్తికాగా ఇంకా 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాటిని సెప్టెంబర్ 18 లేదా 19న ప్రారంభించి అక్టోబర్ 9 లేదా 10వ తేదీన ఫైనల్తో ముగించాలనే ఆలోచనతో బీసీసీఐ అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సైతం సెప్టెంబర్లోనే యూఏఈలో ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనాపై ట్విటర్ వేదికగా సెటైర్లు పేలుతున్నాయి.
బాల్కానీ రూమ్ మరిచిపోవద్దు..
యూఏఈ వేదికగా జరిగిఐ ఐపీఎల్ 2020 సీజన్కు సురేశ్ రైనా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎస్కే ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొన్న అతను జట్టుతో దుబాయ్కి కూడా వెళ్లాడు. అక్కడ క్వారంటైన్ పాటిస్తూ అర్దంతరంగా జట్టును వీడి స్వదేశానికి వచ్చాడు. అయితే తనకు కేటాయించిన హోటల్ గది పట్ల రైనాలో కలిగిన అసంతృప్తే లీగ్ నుంచి తప్పుకునేలా చేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. బాల్కానీ గది విషయంలో సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్తో రైనాకు వాగ్వాదం జరిగినట్లు వార్తలు వినిపించాయి. వీటిని రైనా ఖండించినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు. అయితే మరోసారి యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో రైనాకు బాల్కానీ రూమ్ కేటాయించడం మరిచిపోవద్దని సీఎస్కేను అభిమానులు హెచ్చరిస్తున్నారు.
సీఎస్కేపై ఫన్నీ మీమ్స్..
ఇక రైనా బాల్కానీ రూమ్ విషయంలో నెట్టింట ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్లు యూఏఈలోనే అని బీసీసీఐ చెప్పగానే... సీఎస్కే రైనా కోసం బాల్కానీ రూమ్ బుక్ చేస్తుందని, కర్చీఫ్ కూడా వేసిందనే కామెంట్స్తో మీమ్స్ షేర్ చేస్తున్నారు. తమ ఫొటో ఎడిటింగ్ నైపుణ్యానికి పని చెప్పి మరీ ట్రోల్ చేస్తున్నారు. చిన్న తాలకు బాల్కానీ రూమ్ లేకుంటే కోపం వస్తుందని, అతను మళ్లీ దూరం అవుతాడని హెచ్చరిస్తున్నారు. అతను లేకుంటే చెన్నై పరిస్థితి ఏందో అందరికి తెలుసని, దయచేసి ఈ సారైన బాల్కానీ రూమ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

విభేదాల్లేవ్..
గతేడాది రైనా నిష్క్రమణకు కుటుంబంపై బెంగ, సన్నిహితుల మరణం... ఫ్రాంచైజీతో విభేదాలు.. కారణాలంటూ ప్రచారం జరిగింది. ఇక రైనాకు విజయ గర్వం తలకెక్కిందని చెన్నై జట్టు ఓనర్ ఎన్ శ్రీనివాసన్ మీడియాతో అనడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే ఈ వార్తల్లో బంధువుల అకాల మరణంతోనే టోర్నీ నుంచి తప్పుకున్నానని రైనా స్పష్టం చేశాడు. సీఎస్కే టీమ్మేనేజ్మెంట్తో ఎలాంటి విభేధాల్లేవని, బలమైన కారణం లేకుండా ఏ ఆటగాడు కూడా రూ.12.5 కోట్ల రూపాయలను వదులుకోవడానికి సిద్దపడడని రైనా చెప్పుకొచ్చాడు. తన పరిస్థితి గురించి తెలియక శ్రీనివాసన్ అలా మాట్లాడారని వివరణ ఇచ్చుకున్నాడు.

రైనా బంధువులపై దుండగుల దాడి..
ఇక రైనా యూఏఈలో ఉన్న సమయంలో పంజాబ్లోని అతని బంధువులపై దోపిడీ దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో రైనా మామ (మేనత్త భర్త), కజిన్ మరణించగా.. మేనత్త, మరో కజిన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ హత్యతో కలత చెందిన రైనా హుటాహుటినా భారత్కు పయనమయ్యాడు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం.. విచారణను వేగవంతం చేసి దుండగులను అరెస్ట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications