రాయుడు టీమ్లో ఉండింటే:
తాజాగా సురేశ్ రైనా మాట్లాడుతూ... 'టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో అంబటి రాయుడు అప్పట్లో నిలకడగా రాణించాడు. ఒకవేళ భారత ప్రపంచకప్ జట్టులో రాయుడు ఉండింటే.. మనం 2019 ప్రపంచకప్ గెలిచేవాళ్లం. ఆ నెం.4 స్థానం కోసం రాయుడు ఏడాదన్నరపాటు చాలా హార్డ్వర్క్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడే సమయంలో తన ఆటను దగ్గరగా గమనించాను. తనెంతో బాగా బ్యాటింగ్ చేస్తాడు. ప్రపంచకప్లోనూ అతను మెరుగైన ప్రదర్శన కనబర్చేవాడు. కానీ దురదృష్టం వెంటాడింది. రాయుడికి ఆడే అవకాశం దక్కలేదు' అని అన్నాడు.
కష్టపడే తత్వం ఉన్నవాడు:
'అంబటి రాయుడు కష్టపడే తత్వం ఉన్నవాడు. తననెప్పుడూ నంబర్.4 ప్లేస్లో చూడాలని భావించేవాడిని. నిజానికి 2018 నాటి టూర్ను నేను ఏమాత్రం ఆస్వాదించలేకపోయాను. అప్పుడు రాయుడు ఫిట్నెస్ టెస్టులో విఫలం కావడంతో.. తన స్థానంలో నన్ను సెలక్ట్ చేయడం అంతగా నచ్చలేదు. ఇక ప్రపంచకప్ సమయంలో కూడా తను జట్టుతో లేకపోవడం ప్రభావం చూపింది' అని రైనా అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో తడబడిన భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సెలక్టర్లు మొండిచేయి:
2018 ఐపీఎల్ సీజన్లో పరుగుల వరద పారించిన అంబటి రాయుడు టీమిండియాని సుదీర్ఘకాలం వేధించిన నెం.4 బ్యాట్స్మెన్ సమస్యకి పరిష్కారం చూపాడు. దాదాపు ఏడాదికి పైగా నెం.4లో అతడ్ని ఆడించింది. అయితే 2019 ఐపీఎల్ సీజన్లో మాత్రం రాయుడి పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆపై భారత ప్రపంచకప్ జట్టులో చోటు కోసం ఎంతగానో ఎదురు చూసిన రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపారు. అప్పటికి మెరుగైన రికార్డు, సీనియర్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ అయిన రాయుడిని పక్కనపెట్టి అతడి స్థానంలో విజయ్ శంకర్కు అవకాశమివ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
చెన్నైలో ప్రాక్టీస్:
ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గత కొన్ని సీజన్లుగా అంబటి రాయుడు ఆడుతున్నాడు. ఇటీవల చెన్నై క్యాంప్లో అతని ప్రాక్టీస్ని చూసిన రైనా.. రాయుడు ఇప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కితాబిచ్చాడు. రాయుడు భారత్ తరఫున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఐపీఎల్లో 147 మ్యాచులు ఆడాడు.