జోరుగా ప్రచారం:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో సురేష్ రైనా స్వదేశానికి వచ్చేశాడని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అలానే తనకి రూమ్ని కేటాయించే విషయంలోనూ చెన్నై మేనేజ్మెంట్తో అతను గొడవపడినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే చెన్నై టీం బాస్ ఎన్ శ్రీనివాసన్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ వార్తలపై స్పందించి అవన్ని వట్టి పుకార్లే అని చెప్పారు. రైనాతో ఎలాంటి గొడవ జరగలేదని, అతనిపై కోపం లేదని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసలు విషయాన్ని చెప్పాడు.
కుటుంబానికి నా అవసరం ఉంది:
'ఐపీఎల్ 2020లో ఆడకపోవడం వల్ల నేను బాధపడటం లేదు. నా పిల్లలు, కుటుంబంతో గడపడం సంతోషంగా ఉంది. ఆ సమయంలో నా కుటుంబానికి నా అవసరం ఉంది. పంజాబ్లో ఒక సంఘటన జరిగింది. వారు నాకు అవసరం. అందుకే తిరిగి రావాలని అనుకున్నా. 20 ఏళ్లుగా నేను ఆడుతున్నా. కానీ అవసరమైన సమయంలో కుటుంబానికి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ సమయంలో ఐపీఎల్లో ఆడకుండా వెనక్కి వచ్చేయడమే సరైనదని నాకు అనిపించింది ' అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా తెలిపాడు. పంజాబ్లోని పఠాన్కోట్లో రైనా మేనత్త కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు.
కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చా:
'టీవీలో ఐపీఎల్ చూడటం విచిత్రంగా ఉంది. ఆ సమయంలో నేను జట్టుతో సన్నిహితంగా ఉన్నాను. ఇంట్లో ఉండడం నాకు నిజంగా సవాలు లాంటిదే. కానీ నేను ఇంట్లో ఎక్కువ సమయం గడపడం సంతోషాన్ని ఇచ్చే అంశం. నా పిల్లలు చిన్నవారు. అందుకే నేను నా కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చా' అని మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా స్పష్టం చేశాడు. రైనా వచ్చే ఏడాది మళ్లీ చెన్నై జట్టు తరఫున ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల చెన్నై అధికారి ఒకరు తెలిపారు. మొత్తానికి రైనాను మళ్లీ యెల్లో జెర్సీలోనే అభిమానులు చూడనున్నారు.
ఆ రికార్డ్లు ఏ బ్యాట్స్మెన్కి లేవు:
ఐపీఎల్లో 193 మ్యాచ్లాడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్రేట్తో ఏకంగా 5,368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై టీమ్లో ఈ రికార్డ్లు ఏ బ్యాట్స్మెన్కి లేవు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. తొలి సీజన్ నుంచి చెన్నై తరఫునే రైనా టోర్నీలో ఆడుతున్నాడు. మధ్యలో 2016, 2017లో నిషేధం కారణంగా టోర్నీకి చెన్నై దూరమవగా.. ఆ రెండేళ్లు గుజరాత్ లయన్స్కి ఆడాడు. మళ్లీ చెన్నై రీఎంట్రీ తర్వాత టీమ్లోకి వచ్చేశాడు. గతేడాది ఆగస్టు 15న సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.