చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. చెన్నైలోని వేల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రైనాను గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన సురేష్ రైనా, తమిళనాడులోని చెన్నై సమీపంలో గల వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి శుక్రవారం గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. కాలేజీ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో రైనా డాక్టరేట్ను స్వీకరించాడు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా పంచుకున్న రైనా.. సంతోషయం వ్యక్తం చేశాడు. 'వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, హృదయపూర్తకంగా ధన్యవాదాలు. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది. చెన్నై నాకు హోమ్ టౌన్ లాంటిది. ఈ నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.' అంటూ రైనా ట్వీట్ చేశాడు. టీమిండియా కంటే ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్లు ఆడిన సురేశ్ రైనా నిలకడగా రాణించి 'మిస్టర్ ఐపీఎల్'బిరుదు అందుకున్నాడు.
సురేష్ రైనా ఆడిన ప్రతీ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్కు చేరింది. సీఎస్కే మూడు టైటిల్స్ రావడంలో సురేష్ రైనా పాత్ర చాలా ఉంది. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో అతను కామెంటేటర్గా అవతారమెత్తాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 5 వేలకు పైగా పరుగులు చేసిన సురేష్ రైనా..టీమిండియా తరుపున 18 టెస్టులు ఆడి 768 పరుగులు చేసాడు. 226 వన్డేల్లో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 5615 పరుగులు, 78 టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 1605 పరుగులు నమోదు చేశాడు.
ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్తో పాటు ఇంతర దేశాల్లోని లీగ్ల్లో పాల్గొనేందుకు రైనా సిద్దమవుతున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో కూడా సురేశ్ రైనా బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.