సన్నగా ఉన్నోళ్లే కావాలా? సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై గవాస్కర్ ఫైర్!

న్యూఢిల్లీ: గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో సెంచరీల మోత మోగిస్తున్న ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. సెలెక్టర్లు క్రికెటర్లను ఆకారాన్ని బట్టి కాకుండా వారి ఫామ్ని చూసి ఎంపిక చేయాలని సూచించాడు. సన్నగా ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేయాలనుకుంటే సెలెక్టర్లు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్ని ఎంచుకుని వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి చేర్చుకోవాలని చురకలు అంటించాడు.

సర్ఫరాజ్ ఖాన్ను విస్మరించడంతో..
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో తొలి రెండు టెస్ట్లకు చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలు బాదుతున్న సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలెక్షన్ కమిటీ అతన్ని పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల ప్రదర్శన ఆధారంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లను ఎంపిక చేసింది. సర్ఫరాజ్ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఓ చానెల్తో మాట్లాడిన గవాస్కర్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు.

క్రికెటర్ల ఆకారం కాదు..
'ఫిట్గా లేకుంటే సెంచరీలు చేయలేరు. కాబట్టి క్రికెట్లో ఫిట్నెస్ చాలా ముఖ్యం. మీరు యో-యో టెస్ట్ చేయాలనుకోవడంలో నాకు అభ్యంతరం ఏం లేదు. కానీ, యో-యో టెస్ట్ మాత్రమే ప్రామాణికం కాదు. ఆటగాడు క్రికెట్కు సరిపోతాడనుకుంటే యో-యో టెస్టు ముఖ్యమైనదిగా భావించకూడదు. ఒక ఆటగాడు సెంచరీలు బాదుతున్నాడంటే అతడు క్రికెట్కు ఆడటానికి ఫిట్గా ఉన్నాడని అర్థం. మీకు స్లిమ్గా ఉన్న క్రికెటర్లు మాత్రమే కావాలనుకుంటే మీరు ఫ్యాషన్ షోకి వెళ్లి కొంతమంది మోడల్స్ను ఎంచుకుని, ఆపై వారికి బ్యాట్, బాల్ ఇచ్చి జట్టులోకి తీసుకోండి. క్రికెటర్లు శారీరకంగా చాలా ఆకారాల్లో ఉన్నారు. ఆకారాన్ని బట్టి కాకుండా వారు చేసే పరుగులు, తీసే వికెట్ల ఆధారంగా ఎంపిక చేయండి' అని గవాస్కర్ చురకలంటించాడు.

23 ఇన్నింగ్స్లు.. 10 సెంచరీలు..
సర్ఫరాజ్ ఈ రంజీ సీజన్లోనే కాదు.. గత సీజన్లోనూ సత్తా చాటాడు. 2021-22 సీజన్లో 122.75 యావరేజ్తో 982 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 275. ప్రస్తుత సీజన్లో 107.75 యావరేజ్తో 431 పరుగులు చేశాడు. గత మూడు రంజీ సీజన్లలో అతని యావరేజ్ 100కిపైగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే మూడో సెంచలు నమోదు చేశాడు. హైదరాబాద్పై 126 పరుగులతో నాటౌట్గా నిలిచిన ముంబై క్రికెటర్.. తమిళనాడుపై 162, ఢిల్లీతో 125 పరుగులు చేశాడు. ఈ ముంబై క్రికెటర్ రంజీ ట్రోఫీలో గత 23 ఇన్నింగ్స్ల్లో 10 శతకాలు నమోదు చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications