యాషెస్ సిరీస్ గెలవడంతో..
'డి సెంబరు-జనవరిలో భారత్తో జరిగిన సిరీస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నాడు. ఆ సిరీస్లో ఓటమిని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు ఇంకా జీర్ణించుకోలేదని పైన్ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థమవుతోంది. ఏ విధంగా చూసినా పైన్ మంచి వ్యక్తే. అందరూ అతన్ని ఎంతో గౌరవిస్తారు, ఇష్టపడతారు. 2018 టాంపరింగ్ ఉదంతం అనంతరం అతను కెప్టెన్సీని నిర్వర్తించిన తీరే అందుకు కారణం. అతని నాయకత్వంలోని జట్టు ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొన్నట్లు కనిపిస్తోంది. పైన్లో వ్యూహరచన లోపాన్ని కూడా విస్మరించేంతగా అతణ్ని నమ్మారు. ఈ లోపాలు కొంతకాలంగా స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా ఇంగ్లండ్లో యాషెస్ను ఆసీస్ నిలబెట్టుకోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా భారత్తో సిరీస్లో ఆస్ట్రేలియా మూల్యం చెల్లించుకుంది.
ఆ బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ చూస్తే..
యాషెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ టెస్టులో బెన్ స్టోక్స్. . ఆఖరి బ్యాట్స్మన్ జాక్ లీచ్తో కలిసి ఇంగ్లండ్ను గెలిపించిన తీరు చూస్తే పైన్ వ్యూహ రచన నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది. భారత్తో సిరీస్లోనూ అతని వ్యూహ వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. తొలి టెస్టులో భారత్ను 36 పరుగులకే కుప్పకూల్చిన ఆసీస్.. అలవోకగా సిరీస్ను గెలవాల్సింది. ఆసీస్ దిగ్గజాలంతా తమ జట్టు 4-0తో భారత్ను చిత్తు చేస్తుందని అంచనా వేశారు. భారత జట్టు స్థైర్యం దెబ్బతింది. ఆ జట్టు కెప్టెన్ ఇంటికెళ్లిపోయాడు. ఆసీస్ పేసర్లు భీకర ఫామ్లో ఉన్నారు. మరి తర్వాతి టెస్టులో పైన్ ఏం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్ కోలుకునేలా...
గత టెస్టు మ్యాచ్ పిచ్పై కంటే కూడా ఈ పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన పిచ్ నివేదికలో చెప్పినా కూడా.. 36కే కుప్పకూలి దిగ్భ్రాంతి చెందిన భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించలేదు పైన్. రహానే నేతృత్వంలోని జట్టు ఊపిరిపీల్చుకుని, పిచ్ ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకునేందుకు అవకాశమిచ్చాడు. అదనపు పచ్చికను ఉపయోగించుకున్న భారత పేస్ దళం ప్రత్యర్థిని 200 లోపే ఆలౌట్ చేశారు. సిరీస్లో భారత్ పుంజుకుంది. తర్వాత సిడ్నీ టెస్టులో విహారి, అశ్విన్ గాయాలతో ఇబ్బంది పడుతూ పోరాడుతున్న సమయంలో పైన్.. తన ప్రధాన పేసర్ స్టార్క్ను ఉపయోగించుకోలేదు. నాథన్ లైయన్ కూడా ఒకే ఎండ్ నుంచి బౌలింగ్ చేశాడు. కమిన్సేమో మరి ఎక్కువగా బౌలింగ్ చేశాడు.
అందుకే సాకులు చెబుతున్నాడు..
బ్రిస్బేన్లో కూడా పైన్ పెట్టిన ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు పేలవం. చాలా బంతులు బ్యాట్ అంచుకు తాకి.. నాలుగో స్లిప్ ఉండాల్సిన చోటు నుంచి వెళ్లిపోయాయి. పైన్.. వేడ్ను అక్కడ పెట్టే సమయానికి భారత్ తన స్కోరుకు ఎంతో విలువైన పరుగులును జోడించింది. తన దగ్గర ఈ లోపాలన్నీ పెట్టుకుని పైన్ ఇప్పుడు.. భారతీయులు చికాకు తెప్పించడంలో సిద్ధహస్తులని, అనవసర విషయాలతో తమ ఏకాగ్రతను దెబ్బతీశారని సాకులు చెబుతున్నాడు. నిజానికి ఈ ఆరోపణలు నిజమైతే భారత్కు ఇది ప్రశంస కిందే లెక్క. చికాకు తెప్పించడం, ఏకాగ్రత దెబ్బతీయడంలో గోల్డ్ మెడల్ అందుకోగల స్థాయి ఆస్ట్రేలియాది. అలాంటి జట్టు కెప్టెన్.. భారత్ తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని అంటున్నాడంటే అది మెచ్చుకోలే.'అని గవాస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.