అశ్విన్ రీఎంట్రీ కష్టమే
స్టార్ స్పోర్ట్స్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఆర్ అశ్విన్ ఇక పరిమిత ఓవర్లలో రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. వన్డే, టీ20లోకి రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఉంటాడు. దాంతో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్ కాంబినేషన్తో భారత్ జట్టు తరచూ బరిలోకి దిగుతోంది. అందుకే ప్రస్తుతం అతడికి అవకాశాలు రావని భావిస్తున్నా. అయితే మరో ఆరు సంవత్సరాల పాటు అతడు టెస్టు ప్లేయర్గా కొనసాగుతాడు' అని చెప్పాడు.
2017లో చివరి వన్డే
రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా తరపున 2017లో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతను కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. మధ్యలో కొన్నిసార్లు టెస్టు జట్టులోనూ స్థానం కోల్పోయాడు. అయితే ఈ మధ్యన అశ్విన్ ఆల్రౌండ్ ప్రతిభతో మెరుస్తూ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లే అందుకు నిదర్శనం. అయితే వన్డే, టీ20 జట్టులోకి కుర్రాళ్ల రాకతో అశ్విన్ ఆ ఫార్మాట్లకు పూర్తిగా దూరమయ్యాడు.
394 వికెట్లు.. 2626 పరుగులు
ఆర్ అశ్విన్ టీమిండియా తరపున 111 వన్డేల్లో 150 వికెట్లు.. 675 పరుగులు చేశాడు. 46 టీ20ల్లో 123 పరగులు.. 52 వికెట్లు తీశాడు. 76 టెస్టుల్లో 394 వికెట్లు.. 2626 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒక సెంచరీ చేయడంతో 9 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్ టెస్టు ప్రారంభం కానుంది.
మరో 6 వికెట్లు పడగొడితే
టెస్టు క్రికెట్లో ఆర్ అశ్విన్ ఇప్పటి వరకు 394 వికెట్లు పడగొట్టాడు. 400 వికెట్ల క్లబ్కు 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టులో ఈ మైలురాయి చేరుకుంటే ఈ ఘనత సాధించిన 16వ బౌలర్గా యాష్ నిలువనున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు.
కోహ్లీ ఇంట్లో పనోళ్లే ఉండరు.. షాకింగ్ విషయాలు చెప్పిన మాజీ సెలెక్టర్!!