తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్
ఈసీబీ తగిన జాగ్రత్తలతో బౌలర్లకు గురువారం ప్రాక్టీస్ సెషన్ను ఏర్పాటు చేసింది. ప్రాక్టీస్ సెషన్ కోసం ఇంగ్లండ్లోని ఏడు మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఒక సమయంలో కేవలం ఒక క్రికెటర్కు మాత్రమే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. దీనిలో భాగంగా స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్లు మైదానంలోకి దిగి కాసేపు ప్రాక్టీస్ చేశారు. అయితే బ్రాడ్ ట్రెంట్బ్రిడ్జ్లో, వోక్స్ ఎడ్జ్బాస్టన్లో ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్లు నిలిచారు.
|
బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నా
చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్టువర్ట్ బ్రాడ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా మైదానంలో తను బౌలింగ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. 'ఇలా నేను ప్రాక్టీస్ చేయడం వెనుక చాలా మంది శ్రమ దాగుంది. ఇందులో భాగమైన ఇంగ్లండ్ క్రికెట్ అధికారులు, ట్రెంట్ బ్రిడ్జ్ సిబ్బందికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. సుదీర్ఘ విరామం తర్వాత బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తున్నాను' అని బ్రాడ్ ట్వీట్ చేశాడు. వోక్స్ కూడా బౌలింగ్ చేయడం బాగుందన్నాడు.
తొలి దేశంగా ఇంగ్లండ్:
క్రికెట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్న ఈసీబీ.. వెస్టిండీస్, పాకిస్థాన్తో జరిగే సిరీస్ల కోసం సన్నద్ధమవుతున్నది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత ఆటగాళ్ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి దేశంగా ఇంగ్లండ్ నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న మైదానాలను క్రికెటర్ల వ్యక్తిగత శిక్షణ కోసం వినియోగిస్తామని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భౌతిక దూరం పాటిస్తున్నారని ఈసీబీ తెలిపింది.
'బీసీసీఐ ఐపీఎల్ నిర్వహిస్తే.. మిగతా బోర్డులు తమ ఆటగాళ్లను అనుమతించొద్దు'
వెస్టిండీస్ సిరీస్ జూలైకి వాయిదా
షెడ్యూల్ ప్రకారం జూన్ 4 నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు దాన్ని జూలైకి వాయిదా వేసింది. ఇక ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యటన కోసం మొత్తం 25 మందిని ఇంగ్లండ్ పంపించేందుకు కసరత్తులు చేస్తున్నాం అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ తెలిపారు. ఆగస్టులో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టూర్లో పాక్ మూడు టెస్టులు, మూడు టీ20 సిరీస్లు ఆడుతుంది.