న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ సన్నాహకాలు వేగంగా సాగుతున్నా.. బరిలోకి దిగే విదేశీ ఆటగాళ్లపై మాత్రం సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు వారం రోజులు లేటుగా వస్తారని సమాచారం. ఇక లీగ్ బరిలో ఉన్న ఇద్దరు శ్రీలంక ప్లేయర్లు కూడా అదే దారిలో ఉన్నారు. లసిత్ మలింగ(ముంబై ఇండియన్స్), ఇస్రు ఉడానా(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు).. ఐపీఎల్ రెండో వారంలోనే బరిలోకి దిగనున్నారు.
ఆగస్టు 28న మొదలయ్యే లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) వల్లే వీరు తమ ఫ్రాంచైజీలతో ఆలస్యంగా కలవనున్నారు. ఎల్పీఎల్ ఫైనల్ సెప్టెంబర్ 20న జరగనుంది. పైగా, లీగ్ మధ్యలో వేరే టోర్నీలు ఆడేందుకు తమ ప్లేయర్లను అనుమతించమని లంక బోర్డు కూడా స్పష్టం చేసింది. దీంతో ఎల్పీఎల్ ముగిసిన తర్వాతే ఈ ఇద్దరు యూఏఈకి వస్తారు. వచ్చిన వెంటనే 72 గంటల క్వారంటైన్ విధిగా పాటించాలి.
దీంతో ఐపీఎల్ 13వ ఎడిషన్లో తమ ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు కనీసం 7 నుంచి 8 రోజులు వేచి ఉండాలి. ముంబైకు మలింగ కీలకం కాబట్టి ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి. సఫారీ ప్లేయర్లు కూడా ఐపీఎల్కు ఇన్టైమ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాలో లాక్డౌన్ అమలులో ఉండడమే ఇందుకు కారణం. దీంతో ఆర్సీబీ కీలక ఆటగాడు ఏబీ డివిలియర్స్ దూరమయ్యే అవకాశం ఉండటంతో ఆ జట్టు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇక సెప్టెంబర్ 16 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ జరగనుండడంతో వారు ఫస్ట్ వీక్ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా, ఇంగ్లండ్, ఆసీస్ మధ్య సెప్టెంబర్ 16న చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్లో ఆడే ఇరు జట్లు ఆటగాళ్లు అదే రోజున దుబాయ్ బయలుదేరే అవకాశముంది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనల కారణంగా ఫస్ట్ వీక్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ లీగ్ వీదేశీ ఆటగాళ్ల జాబితాలో ఈ రెండు దేశాల ఆటగాళ్లదే మెజార్టీ వాటా. ఆస్ట్రేలియా(17), ఇంగ్లండ్(11) నుంచి మొత్తం 28 మంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకున్నారు.
విరుష్క పెద్ద మనసు.. వరద బాధితులకు సాయం!