
కొలంబో: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక యువ పేసర్ షెహాన్ మధుశంకపై ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. విచారణ పూర్తై తుది తీర్పు వెలువడే వరకు అతను ఎలాంటి క్రికెట్ ఆడరాదని సస్పెన్షన్ విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇక షెహాన్ మధుశంక హెరాయిన్తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన విషయంతెలిసిందే. లంకలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి ప్రయాణిస్తోన్న 25 ఏళ్ల మధుశంకను పన్నాల పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది. పోలీసులు మేజిస్ట్రేట్ మందు హాజరుపరచగా... రెండు వారాలపాటు రిమాండ్కు తరలించింది.
బంగ్లాదేశ్తో 2018లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన మధుశంక, ఆ ఘనతను అందుకున్న నాలుగో బౌలర్గా చరిత్రకెక్కాడు. అతనికన్నా ముందు తైజుల్ ఇస్లామ్(బంగ్లాదేశ్), కగిసో రబడా(సౌతాఫ్రికా), వానిందు హసరంగా(శ్రీలంక) అరంగేట్ర మ్యాచ్లోనే హ్యాట్రిక్ వికెట్ పడగొట్టారు. మధుశంక రెండు టీ20ల్లోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం గాయాల బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా శ్రీలంకలో లాక్డౌన్ కొనసాగిస్తుండగా.. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 1100 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 10 మంది మాత్రమే చనిపోయారు.