ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సీఎస్కే అభిమానులకు ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇన్నాళ్లూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్.. ఈ సీజన్లో పసుపు రంగు జెర్సీ ధరించి ఎంఎస్ ధోనీతో కలిసి ఆడబోతున్నాడు. అయితే సంజూ శాంసన్ రాకతో సీఎస్కేలో అతడి పాత్ర ఏమిటన్న దానిపై టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ధోనీ బాధ్యతలు సంజూ శాంసన్కే!
జియో స్టార్ షోలో మాట్లాడిన అనిల్ కుంబ్లే.. ఎంఎస్ ధోనీ తర్వాత చెన్నై జట్టును ముందుండి నడిపే 'పోస్టర్ బాయ్' సంజూ శాంసన్ మాత్రమేనని అభిప్రాయపడ్డాడు. కుంబ్లే వెల్లడించిన వివరాల ప్రకారం.. ధోనీ ఈ సీజన్లో సంజూ శాంసన్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు పూర్తిగా అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్నప్పటికీ.. రాజస్థాన్ను నడిపించిన అనుభవం ఉన్న సంజూ శాంసన్.. భవిష్యత్తులో సీఎస్కేకు కీలక నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. సంజూ శాంసన్ కేరళలో జన్మించినప్పటికీ తమిళం చక్కగా మాట్లాడగలడు. ఇది చెన్నై అభిమానులతో సంజూ త్వరగా మమేకమవడానికి సహాయపడుతుంది.

టీమిండియా వారసత్వంలా..
"భారత క్రికెట్లో సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్, ఆపై విరాట్ కోహ్లీ వరకు వారసత్వం ఎలా అందిందో.. ఇప్పుడు ధోనీ నుంచి ఆ బాధ్యతను సంజూ శాంసన్ అందుకోబోతున్నాడు. టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూను తీసుకోవడం సీఎస్కే చేసిన అత్యుత్తమ నిర్ణయం" అని అనిల్ కుంబ్లే ప్రశంసించాడు.
వైస్ కెప్టెన్ హోదాలో సంజూ శాంసన్?
రాజస్థాన్ రాయల్స్లో కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్.. సీఎస్కేలో మాత్రం వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సంజూ తన అనుభవాన్ని జట్టుకు అందించనున్నాడు. ధోనీ కేవలం ప్లేయర్గా ఉంటూ, సంజూకు వికెట్ల వెనుక మెళుకువలు నేర్పిస్తూ అతడిని ఓ పరిపూర్ణ వారసుడిగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026లో సీఎస్కే మొదటి మ్యాచ్ ఎప్పుడు?
చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 30న తన పాత జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్తోనే ఆడబోతుండటం విశేషం. గౌహతి వేదికగా జరిగే ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ తన పాత జట్టుపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉండటంతో, ఈ సీజన్ అంతా సంజూ శాంసన్ను తన వారసుడిగా సిద్ధం చేయడానికే ధోనీ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.