ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ప్లేయర్లు టాప్-5లో ఏకంగా మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచి తన ఫామ్ను చాటుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఇబ్రాహీం జద్రాన్ మూడో స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో, యువ సంచలనం శుభ్మన్ గిల్ ఐదో స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని టాప్-5 బ్యాటర్లలో ముగ్గురు భారతీయులే ఉండటం టీమిండియా బ్యాటింగ్ పటిష్టతకు నిదర్శనం.
బౌలింగ్, ఆల్రౌండర్స్ విభాగంలో ఆఫ్ఘన్ ఆటగాళ్ల హవా
బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆశ్చర్యకరంగా నమీబియాకు చెందిన బెర్నార్డ్ స్కోల్ట్జ్ నాలుగో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి స్థానంలో ఉండగా,..సికందర్ రజా (జింబాబ్వే), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) టాప్-3లో నిలిచారు.

మహిళల ర్యాంకింగ్స్: స్మృతి మంధాన టాప్!
మహిళల వన్డే క్రికెట్లోనూ భారత్ తన జెండాను ఎగురవేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతూ దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇంగ్లాండ్కు చెందిన నాట్ స్కివర్-బ్రంట్ రెండో స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐదో స్థానంలో నిలిచి టాప్-5లో చోటు సంపాదించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ, దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ కూడా మెరుగైన ర్యాంకులు సాధించారు.
టీ20ల్లోనూ భారత్ జోరు
కేవలం వన్డేల్లోనే కాకుండా టీ20 ఫార్మాట్లో కూడా భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తాజా టీ20 ర్యాంకింగ్స్లో యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ హవాను కొనసాగిస్తున్నారు. అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతుందా.. ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. తిలక్ వర్మ ఒక స్థానం ఎగబాకి 7వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు.సూర్యకుమార్ యాదవ్ టాప్ 10లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.సంజూ శాంసన్ 22వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకుని మెరుగుపడ్డాడు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన ర్యాంకును మెరుగుపరుచుకుని ప్రమోషన్ పొందాడు. వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకుని 6వ ర్యాంకు నుండి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు.
మొత్తంగా పురుషుల, మహిళల విభాగాల్లో భారత ఆటగాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు.